కశ్మీర్‌లో హిజ్బుల్‌ ఉగ్రవాది ఎన్‌కౌంటర్‌

18 May, 2019 08:11 IST|Sakshi

శ్రీనగర్‌ : పుల్వామా, అనంతనాగ్‌లో సంభవించిన రెండు వేర్వేరు ఎదురుకాల్పుల ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. శనివారం ఉదయం పుల్వామా జిల్లా అవంతిపొర ప్రాంతంలోని పంజ్‌గామ్‌ గ్రామ సమీపంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ప్రాంతంలో ముష్కరులు తలదాచుకున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు.. 130 బెటాలియన్‌ సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది, 55 రాష్ట్రీయ రైఫిల్స్‌, స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌ సాయంతో గాలింపు చేపట్టారు. ఈక్రమంలో ఉగ్రవాదులకు, భద్రతా సిబ్బందికి మధ్య ఎదురు కాల్పులు చోటు చోసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయినట్లు అధికారులు వెల్లడించారు.

వీరిలో ఒకరు హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన కమాండర్‌ షౌకత్‌ అహ్మద్‌ దార్‌గా భావిస్తున్నారు. గతంలో ఔరంగజేబులో జరిగిన కాల్పుల్లో.. అహ్మద్‌ ఓ జవాన్‌ను హత్య చేశాడు. మరొక ఉగ్రవాది గురించి వివరాలు తెలియరాలేదు. ఎన్‌కౌంటర్‌ అనంతరం అధికారులు సంఘటన స్థలం నుంచి ఒక ఏకే - 56 రైఫిల్‌ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఉగ్రవాదులు తలదాచుకున్న ఇంటిని కూడా పేల్చేశారు.

>
మరిన్ని వార్తలు