ఆ ఆంటీ ముంబైకి వస్తే బాగుండు..!

22 Feb, 2020 18:21 IST|Sakshi

పుణె: లక్షలాది వాహనాలు, దుమ్మూ, ధూళి, పొగతో సతమతమయ్యే నగరాల్లోని బాటసారులకు కనీసం నడిచే తోవ కూడా ఉండటం లేదు. ఫుట్‌పాత్‌లను ఆక్రమించి కొందరు వ్యాపారాలు చేసుకుంటుండగా.. మరికొందరు ద్విచక్ర వాహనదారులు షార్ట్‌కట్‌గా ఫుట్‌పాత్‌పై నుంచి బక్‌ పోనిస్తున్నారు. దీంతో బాటసారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. పుణె నగరం కూడా దీనికి మినహాయింపు కాదు. ఈనేపథ్యంలో నగరానికి చెందిన ఓ పెద్దావిడ ద్విచక్ర వాహనదారులకు తగిన ‘బుద్ధి’ చెప్పారు. ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించకుండా ఫుట్‌పాత్‌ పైనుంచి వస్తున్న బైకర్లను అడ్డుకుని.. చీవాట్లు పెట్టారు. ఆమె ‘క్లాస్‌’కు భయపడ్డ బైకర్లు ఫుట్‌పాత్‌ పైనుంచి వచ్చేందుకు వెనకడుగు వేశారు.

ఈక్రమంలోనే ఆమెకు మరో ఇద్దరు కూడా జత కలిశారు. ముగ్గురూ కలిసి ఫుట్‌పాత్‌ పైనుంచి వాహనాలు రాకుండా కట్టడి చేశారు. ఈ వీడియోను అమిత్‌ రూకే అనే జర్నలిస్టు ట్విటర్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌ అయింది. రెండు రోజుల్లోనే 2.3 లక్షల వ్యూస్‌ సాధించింది. ఇక పెద్దావిడ చొరవపై కామెంట్లు వర్షం కురుస్తోంది. ఆంటీ బాగా బుద్ధి చెప్పిందని కొందరు, పుణె పోలీసులకు కర్తవ్యం గుర్తుకు తెచ్చారని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. గాడ్‌ బ్లెస్‌ యూ మేడమ్‌, ఫుట్‌పాత్‌పై బైక్‌ నడిపేవారు సిగ్గుపడాలి ఇంకొకరు కామెంట్‌ చేశారు. ‘ఈ ఆంటీ ముంబైకి వచ్చి మాతో ఉంటే బాగుండు. ఒక మంచి పని చేస్తే అందరూ మద్దతుగా నిలుస్తారని ఇక్కడి జనం కూడా తెలుసుకుంటారు’అని ఓ యూజర్‌ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు