న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ సంజయ్ సింగ్ రాజీనామా చేశారు. ఆయనతోపాటు మరో నేత, పంజాబ్ పార్టీ పరిశీలకుడిగా పనిచేస్తున్న దుర్గేశ్ పాఠక్ కూడా తన రాజీనామా లేక సమర్పించారు.
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర వైఫల్యం చెందిన నేపథ్యంలో తాము రాజీనామా చేసినట్లు తెలిపారు. ‘నేను నా రాజీనామా లేఖను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఇచ్చేశాను. నాతో పాటు మరో నేత కూడా చేశారు’ అని ఆయన చెప్పారు. గురువారం ఉదయమే తాను రాజీనామా లేఖ కేజ్రీవాల్కు అందజేసినట్లు తెలిపారు. పంజాబ్ ఎన్నికల ప్రచారంలో పార్టీకి విజయాన్ని కట్టబెట్టడంలో కూడా సంజయ్ సింగ్ వైఫల్యం చెందిన నేపథ్యంలో ఈ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.