ఆర్మీతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న పంజాబ్ సీఎం
చండీగఢ్ : పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ‘ఫ్రెండ్షిప్ డే’ సందర్భంగా భారత ఆర్మీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆర్మీలో పనిచేసినప్పటి బ్లాక్ అండ్ వైట్ ఫొటోను ట్విటర్లో పోస్టు చేసి పలు విషయాలు పంచుకున్నారు. ‘ఇండియన్ ఆర్మీతో ఉన్న అనుబంధం కంటే గొప్పదేదీ లేదు. దేశ రక్షణ కోసం పనిచేసే చోట నాకు లభించిన స్నేహితులు, ఆదరణ చాలా గొప్పది. మన వెన్నంటి ఉండే స్నేహితులందరికీ వరల్డ్ ప్రెండ్షిప్ డే శుభాకాంక్షలు’అన్నారు. అమరీందర్ సింగ్ సిక్కు రెజిమెంట్ 2వ బెటాలియన్లో 1963 నుంచి 69 వరకు కెప్టెన్గా సేవలందించారు. కుటుంబ సమస్యల నేపథ్యంలో ఆర్మీలో చేరిన కొద్ది కాలానికే ఆయన ఇంటికి తిరిగొచ్చేశారు. అయితే, దేశ రక్షణకై సేవలందిచడం ఎంతో ఇష్టంగా భావించే ఆయన భారత్-పాక్ యుద్ద (1965) సమయంలో మళ్లీ ఆర్మీలో చేరారు. అమరీందర్ తండ్రి లెఫ్టినెంట్ జనరల్ మహారాజా యద్వీర్సింగ్ కూడా దేశ రక్షణకై పనిచేశారు.