‘నిద్ర లేవండి...మత్తు వదిలించండి’

29 Jun, 2018 12:47 IST|Sakshi

చండీగఢ్ : ఓ ఐదేళ్ల పిల్లవాడు చక్కగా తయారై, చేతిలో స్కూల్‌ బ్యాగ్‌ పట్టుకుని వచ్చి తండ్రి పక్కన కూర్చున్నాడు. ఏంటి రోజు పెందలాడే లేసే నాన్న ఈ రోజు ఇంకా లేవలేదు అనుకుంటున్నాడు. స్కూల్‌కి లేటవుతుంది ఎలా. ఇలా అయితే కుదరదని తనే తండ్రిని లేపుతున్నాడు. ‘నాన్న లే...నాకు స్కూల్‌ టైం అవుతుంది. నన్ను స్కూల్‌ దగ్గర వదిలేద్దువు లే నాన్న’ అంటున్నాడు. ఈ దృశ్యం అక్కడి ఉన్న ప్రతి ఒక్కరిని కలచివేస్తుంది. ఎందుకంటే ఆ కుర్రాడి తండ్రి మరణించాడు. కారణం అధిక మోతాదులో మత్తు పదార్థాలు తీసుకోవడం.

అదే పట్టణంలో కొందరు యువకులు ఓ మధ్య వయస్కున్ని పట్టుకుని చితకబాదారు. కారణం ఆ పెద్దయాన డ్రగ్స్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేయడం. కపుర్తాలలో డ్రగ్స్‌ సరఫరా చేసే ముఠాను అరెస్ట్‌ చెద్దామని వెళ్లిన పోలీసుల మీద దుండగులే తిరిగి దాడి చేశారు. ఫరిదాబాద్‌లో ఓ తల్లి తన కుమారుడి మృతదేహం మీద పడి విలపిస్తుంది. కారణం ఎదిగిన కొడుకు కుటుంబానికి ఆసరా అవుతాడనుకుంటే మత్తుకు బానిసయ్యి విగతజీవిలా పడి ఉన్నాడు. ఇవన్ని పంజాబ్‌లో ప్రతినిత్యం కనిపించే దృశ్యాలు. మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ‘ఓవర్‌డోస్‌ డ్రగ్స్‌’ అయ్యి మరణిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ప్రస్తుతం ఇదే అంశం పంజాబ్‌ రాజకీయాల్లో వేడి పుట్టిస్తుంది.

దాంతో పంజాబ్‌లోని ప్రతిపక్ష పార్టీలైన శిరోమణి అకాలీ దళ్(ఎస్‌ఏడీ), ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఏఏపీ), అమరేందర్‌ సింగ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగం పై చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారు అంటూ ప్రశిస్తున్నాయి. ‘ఓవర్‌డోస్‌ డ్రగ్స్‌’ తీసుకోవడం వల్ల మరణిస్తున్న వారి గురించి అంసెంబ్లీలో ప్రత్యేక చర్చ నిర్వాహిచాలని పట్టుబడుతున్నాయి.

కన్వర్‌ సంధు అనే ఆప్‌ ఎమ్మేల్యే పంజాబ్‌లో మత్తు పదార్థాల నియంత్రణ కోసం నియమించిన స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ ‘పళ్లు లేని పులిలా’ మారిందని విమర్శించారు. ‘రాష్ట్రం మత్తులో జోగుతుంటే మీరు నిద్ర పోతున్నారా’ అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కానీ అధికార పార్టీ నేతలు మాత్రం ఎన్నో ఏళ్లుగా ఉన్న డ్రగ్స్‌ సమస్యను రాత్రికి రాత్రే పూర్తిగా నిర్మూలించడం కుదరదు అంటున్నారు. ‘డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించడానికి మరి కొంత సమయం పడుతుంది. మా ప్రభుత్వం ఆ ప్రయత్నంలోనే ఉంది అంటున్నా’యి పాలక వర్గాలు.

మరిన్ని వార్తలు