చండీగఢ్: ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19) బాధితులకు పంజాబ్ ప్రభుత్వం భారీ షాకిచ్చింది. కరోనా లక్షణాలతో ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరిన వారి ఖర్చును ప్రభుత్వం భరించదని స్పష్టం చేసింది. ఎవరి ఖర్చులు వారే భరించుకోవాలని అమరీందర్ సింగ్ సర్కారు పేర్కొంది. కాగా మంగళవారం నాటికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 256కు చేరింది. (కరోనాతో వ్యాపారి మృతి.. ఢిల్లీలో కలకలం)
ఇదిలా ఉండగా... రాష్ట్రంలో దశలవారీగా మద్యం అమ్మకాలు జరిపేందుకు అనుమతినివ్వాలని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కేంద్రాన్ని కోరారు. అదే విధంగా కరోనా సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రానికి 3 వేల కోట్ల రూపాయలు విడుదల చేసేలా చొరవ తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఆయన లేఖ రాశారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ‘‘మధ్యంతర పరిహారంతో పాటు బకాయి పడిన జీఎస్టీ రూ. 4400 కోట్లు వెంటనే విడుదల చేయండి. కరోనాపై పోరులో రాష్ట్రాలకు ఆర్థికంగా అండగా నిలబడాల్సిన ఆవశ్యకత ఉంది’’అని అమరీందర్ సింగ్ లేఖలో పేర్కొన్నారు. అంతేగాకుండా కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఖజానా అధిక భారం పై పడుతున్నందున రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని అని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.