సింగర్‌పై కేసు నమోదు.. అధి​కారికి హత్యా బెదిరింపులు

10 Jul, 2019 20:53 IST|Sakshi

చండీగఢ్‌: పంజాబ్‌ ర్యాప్‌ సింగర్‌ హనీ సింగ్‌పై కేసు నమోదు చేసిన అనంతరం తనకు హత్యా బెదిరింపులు వస్తున్నాయని ఆ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ మనీషా గలాటీ తెలిపారు. హనీ సింగ్‌ రూపొందించే అల్బమ్స్‌లో మహిళలను అవమానించే రీతిలో అసభ్య పదాలు ఉన్నాయంటూ పలువురు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై హర్యానా హైకోర్టు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫిర్యాదుల ఆధారంగా ఇటీవల అతనిపై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి తన ట్విటర్‌ ఖాతా ద్వారా హత్యా బెదిరింపులుతో పాటు, అసభ్య సందేశాలు పంపుతున్నట్లు వెల్లడించారు.

అయితే తాను ఎవరికీ భయపడేదిలేదని, ఇలాంటి వాటిపై తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని మనీషా స్పష్టం చేశారు. వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కాగా హనీ సింగ్‌ పాటలు అభ్యంతరకర రీతిలో ఉంటున్నాయని, వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పోలీస్‌ కమిషనర్‌కు, హోంశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. దీనిని దృష్టిలో పెట్టుకున్న అతని అభిమానులు తనను వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 
 

మరిన్ని వార్తలు