రత్న భాండాగారం తెరవాలి

20 Aug, 2018 15:14 IST|Sakshi
పాదయాత్ర చేస్తున్న జగన్నాథ్‌ సంస్కృతి సురక్షా పరిషత్‌ కార్యకర్తలు  

జగన్నాథ్‌ సంస్కృతి సురక్షా  పరిషత్‌ కార్యకర్తలు  పాదయాత్ర

భేటీకి ముఖ్యమంత్రి నిరాకరణ

పెదవి కదపలేని న్యాయ శాఖ  మంత్రి

భువనేశ్వర్‌ : జగన్నాథుని అమూల్య రత్న, వైడూర్య సంపదని భద్రపరిచే రత్న భాండాగారం తాళం చెవి గల్లంతు అయింది. ఈ సంఘటన బయటకు పొక్కడంతో విశ్వవ్యాప్తంగా స్వామి భక్తుల హృదయాల్లో కలకలం రేకెత్తింది. అనతి కాలంలోనే రత్న భాండాగారం నకిలీ తాళం చెవి లభించినట్టు వార్తలు ప్రసారం అయ్యాయి. దీంతో సర్వత్రా పలు సందేహాలకు బలం పుంజుకున్నాయి. వాస్తవ తాళం చెవి గల్లంతు కావడం, తక్షణమే నకిలీ తాళం చెవి ప్రత్యక్షం కావడం రత్న భాండాగారంలో సొత్తు పట్ల స్వామి భక్త జనుల్లో అభద్రతా భావం స్థిరపడింది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రత్న భాండాగారం తాళం తెరిచి భద్రపరిచిన సొత్తు వాస్తవ లభ్యతని సార్వత్రికంగా ప్రకటించాలని పలు వర్గాలు పట్టుబడుతున్నాయి.

స్వామి సొత్తు ఆడిట్‌ కూడా చేయించాలని ఈ వర్గాలు ప్రభుత్వానికి అభ్యర్థిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్నాథ్‌ సంస్కృతి సురక్షా పరిషత్‌ కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు. జగన్నాథుని దేవస్థానం సింహ ద్వారం ఆవరణ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఇంటివరకు ఈ యాత్ర నిరవధికంగా నిర్వహించారు. ఈ ప్రతినిధులతో భేటీ అయ్యేందుకు ముఖ్యమంత్రి నిరాకరించారు. రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ప్రతాప్‌ చంద్ర జెనాతో సంప్రదించాలని ఫిరా యించారు. నిరుత్సాహం చెందకుండా పాదయాత్రికులు న్యాయ శాఖతో సంప్రదించిన ప్రయోజనం శూన్యంగా పరిణమించిందని జగన్నాథ్‌ సంస్కృతి సురక్షా పరిషత్‌ కన్వీనర్‌ అనిల్‌ బిశ్వాల్‌ విచారం వ్యక్తం చేశారు.

కార్యకర్తలు ప్రస్తావించిన ఏ అంశంపట్ల న్యాయ శాఖ మంత్రి పెదవి కదపలేని దయనీయ పరిస్థితిని ప్రదర్శించినట్టు పేర్కొన్నారు. కార్యకర్తలు నినాదాల పట్ల స్పందించేందుకు ముఖ్యమంత్రి ఆది నుంచి నిరాకరించగా న్యాయ శాఖ మంత్రి పెదవి కదపలేని నిస్సహాయత ప్రదర్శించడం ప్రజల్లో తేలియాడుతున్న సందిగ్ధ భావాలు మరింత బలపడ్డాయి. రౌర్కెలా స్థానిక సమస్యల నేపథ్యంలో ప్రతినిధి బృందాలతో సంప్రదింపులకు అనుమతించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ అశేష భక్త జనుల ఆరాధ్య దైవం జగన్నాథుని రత్న భాండాగారం సొత్తు ఇతరేతర సంస్కరణలు వగైరా అంశాల పట్ల చర్చించేందుకు ఉద్యమించిన వర్గాలకు అనుమతించకపోవడం తెర వెనక పరిస్థితులు ఏమిటోనని ఈ వర్గం ఆవేదన వ్యక్తం చేసింది. 

ప్రతినిధి బృందం డిమాండ్లు

  •  రత్న భాండాగారం తాళం చెవి గల్లంతు తర్వాత నకిలీ తాళం చెవి లభ్యత వివాదంపై విచారణ నివేదిక సార్వత్రికం చేయాలి. 
  •  నకిలీ తాళం చెవి లభ్యత పురస్కరించుకుని రత్న భాండాగారం తెరిచి బంగారం, వెండి ఇతరేతర ఆభరణాలు, పాత్రల పరిశీలన లెక్కింపు. సొత్తు ఆడిట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 
  •  జగన్నాథుని నవ కళేబరం పురస్కరించుకుని వెలుగు చూసిన పరంపర ఉల్లంఘనపట్ల విచారణ వర్గం నివేదిక బహిరంగపరచాలి. 
  •  జగన్నాథుని దేవస్థానంలో సంస్కరణలు పురస్కరించుకుని సుప్రీం కోర్టులో కొనసాగుతున్న కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి బహిరంగం కావాలి.
  •  సుప్రీం కోర్టులో దాఖలు చేసేందుకు యోచిస్తున్న ప్రభుత్వ వైఖరిని తొలుత రాష్ట్ర ప్రజలకు బహిరంగపరచాలని పాద యాత్రికులు డిమాండ్‌ చేవారు. 
  • ప్రపంచవ్యాప్త దేవస్థానాలతో జగన్నాథుని దేవస్థానం సరిపోల్చడం తగదు. ఈ దేవస్థానం విధి విధానాలు పలు అంశాలు భిన్నాతి భిన్నంగా కొనసాగుతున్నాయి. తరతరాలుగా కొనసాగుతున్న వంశ పరంపర యథాతధంగా కొనసాగించాలని ఈ వర్గం ప్రతిపాదించింది.

మరిన్ని వార్తలు