వైరల్‌ : వామ్మో! కొండ చిలువ.. గాల్లోకి లేచి మరీ..

26 Nov, 2019 13:04 IST|Sakshi

కొండచిలువలు నేలపై ఉండి మాత్రమే వేటాడుతాయని తెలుసు. కానీ నీటిలో ఉండి కూడా వేటాడుతాయని తాజా వీడియో ద్వారా తెలుస్తుంది. ఓ భారీ కొండచిలువ కొలనులో మాటువేసి ఓ జింకపిల్లను అమాంతం పట్టేసి శరీరాన్ని నుజ్జునుజ్జు చేసిన దృశ్యం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను మహారాష్ట్రకు చెందిన ఏఎఫ్‌ఎస్‌ అధికారి ఒకరు ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. 

వీడియోలో ఏముందంటే.. బురదతో నిండిన ఓ మడుగు వద్దకు నీళ్లు తాగేందుకు వచ్చిన జింకలను చూసిన కొండ చిలువ నెమ్మదిగా నీటి అడుగున ఈదుతూ ఆ జింకలను సమీపించింది. జింకలు దాన్ని గమనించకుండా నీళ్లు తాగడం కొనసాగించాయి. దీంతో కొండ చిలువ నీటి నుంచి ఒక్కసారిగా నిట్టనిలువుగా నిలుచుని జింక మెడను పట్టుకుంది. ఆ వెంటనే దాన్ని చుట్టేసి.. శరీరాన్ని నుజ్జు చేసింది. ఒళ్లు గగుర్పొడిచేలా ఈ వీడియో ఉంది. మహారాష్ట్రలోని చందా డివిజన్‌ అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ టీవీల్లో రికార్డైన దృశ్యాలుగా తెలుస్తోంది.

మరిన్ని వార్తలు