అర్థరాత్రి.. ప్రైవేట్‌ వాహనాల్లో ఈవీఎంల తరలింపు

21 May, 2019 11:34 IST|Sakshi

లక్నో : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిసినప్పటికి.. ఈవీఎంల తరలింపు వ్యవహారంలో మాత్రం రోజుకో వివాదం తెర మీదకు వస్తోంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో ఈవీఎంలు.. అర్థరాత్రి పూట  ప్రైవేట్‌ వాహనాల్లో దర్శనమివ్వడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్‌ ఘాజీపూర్‌ బీఎస్పీ అభ్యర్థి అఫ్జల్‌ అన్సారీ, తన కార్యకర్తలతో కలిసి.. స్ట్రాంగ్‌ రూమ్‌ ఎదుట నిరసనకు దిగారు. ఓ మిని ట్రక్కు నిండా ఈవీఎంలను తరలించేదుకు ప్రయత్నించారని అన్సారీ ఆరోపిస్తున్నారు. అందుకు ఆధారంగా ఓ వీడియోను కూడా చూపిస్తున్నారు. ఆదివారం పోలింగ్‌ ముగిస్తే.. ఇప్పుడేలా ఈవీఎంలను తరలిస్తారని అన్సారీ ప్రశ్నిస్తున్నారు.

అయితే ఈ ఆరోపణలను జిల్లా కలెక్టర్‌ కొట్టి పారేస్తున్నారు. వీడియోలో చూపిన 35 ఈవీఎంలను అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తీసుకొచ్చామని.. వాటిని ఇప్పుడు తరలించామని తెలిపారు. గత గురువారం కూడా యూపీలో ఇలాంటి సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఓ ప్రైవేట్‌ వాహనంలో ఈవీఎంలను తరలించేందుకు ప్రయత్నిస్తుండగా.. ఎస్పీ, బీఎస్పీ నాయకులు అడ్డుకున్నారు. అయితే ఇవి ఎక్స్‌ట్రా ఈవీఎంలు అని అధికారులు సర్ది చెప్పారు. అలానే బిహార్‌లోని సరాన్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని ఓ ప్రాంతంలో ఓ ప్రైవేటు వాహనంలో  పదుల సంఖ్యలో ఈవీఎంలను తరలిస్తుండగా విషయం తెలుసుకున్న ఆర్‌జేడీ కార్యకర్తలు అధికారులను నిలదీశారు.

>
మరిన్ని వార్తలు