'రేపిస్టులను రక్షించండి, అత్యాచారాలను పెంచండి'

7 Dec, 2019 14:30 IST|Sakshi

పాట్నా: ఐదేళ్ల మైనర్ బాలికను దర్భాంగాలో ఆటో డ్రైవర్‌ అత్యాచారం చేసిన ఘటనపై బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ మోదీ మీడియా ముందు మాట్లాడకుండా దాటవేయడాన్ని ఆర్జేడీ అధ్యక్షుడు, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ భార్య రబ్రీ దేవీ విమర్శించారు. దర్భాంగా అత్యాచార ఘటనపై బిహార్ ఉప ముఖ్యమంత్రి స్పందించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం మహిళల భద్రతపై నితీష్ కుమార్ నేతృత్వంలోని బిహార్‌ ప్రభుత్వానికి ఆమె చురకలంటించారు. ట్విటర్‌ వేదికగా రబ్రీ దేవీ..  'రేపిస్టులను రక్షించండి, అత్యాచారాలను పెంచండి' అనే రీతిలో నితీష్ కుమార్ ప్రభుత్వం నడుస్తోందని మండిపడ్డారు. సిగ్గు లేని, పనికి మాలిన ప్రభుత్వం బిహార్‌లో రాజ్యమేలుతోందని విమర్శించారు. అనవసరపు విషయాల్లో తలదూర్చి.. ఏదైనా సమస్య తలెత్తగానే పారిపోయే బలహీన, పిరికి ఉప ముఖ్యమంత్రికి.. దర్భాంగా ఘటనతో మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలీట్లేదని ఎద్దేవా చేశారు. 
 

 వివరాల్లోకి వెళితే..  5 సంవత్సరాల మైనర్‌ బాలిక ఆరుబయట ఆడుకుంటుండగా.. ఆమెను అపహరించి అత్యాచారం చేసిన ఘటన సదర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకొంది. దుండగుబు ఆమెను తోటలో తీసుకెళ్లి.. లైంగిక దాడి చేసి అక్కడే వదిలేశాడు. అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు ఆటో డ్రైవర్‌గా గుర్తించారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. పోలీసులు విచారణ చేపడుతున్నారు.  

కాగా దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన దిశ అత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌ను స్వాగతిస్తున్నామని రబ్రీ దేవీ  పేర్కొన్నారు.  దిశ కేసులో హైదరాబాద్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌ నేరస్థులను కొంతమేర కట్టడి చేస్తుందని అన్నారు. బిహార్‌లో మహిళలపై దాడులు పెరుగుతున్నాయని తెలిపారు. 

మరిన్ని వార్తలు