ఐశ్వర్య మా ఇంటి లక్ష్మీ

15 May, 2018 10:45 IST|Sakshi

పట్నా : కొత్త కోడలు ఐశ్వర్య రాయ్‌పై  బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి పొగడ్తల వర్షం కురిపించారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌, రబ్రీదేవిల పెద్ద కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌, ఐశ్వర్య రాయ్‌ల వివాహం శనివారం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. దాణా కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ఈ పెళ్లి కోసం మూడు రోజుల పెరోలుపై బయటకు వచ్చారు. సోమవారం కొత్త దంపతులతో కలసి విష్ణు ఆలయానకి వెళ్లిన రబ్రీదేవి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ కార్యక్రమాలు ముగించుకుని వస్తుండగా రబ్రీదేవిని మీడియా ప్రతినిధులు కోడలి గురించి ప్రశ్నించగా ఆమె చాలా ఆనందం వ్యక్తం చేశారు.

రబ్రీదేవి మాట్లాడుతూ.. ‘నా కోడలు చాలా అదృష్టవంతురాలు. ఐశ్వర్య మా ఇంటి లక్ష్మీ.. ఆమె రాకతో మా కుటుంబంలో మంచి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇది ఒక శుభ శకునం’ అని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న లాలూకి ఆరు వారాల తాత్కాలిక బెయిల్‌ లభించడం.. గత నెలలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన రబ్రీదేవి తాజాగా శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఎన్నిక కావడంతో ఆమె ఇలా స్పందించి ఉంటారనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.  సోమవారం పెరోల్‌ గడువు ముగియడంతో లాలూ రాంచీ జైలుకు వెళ్లిపోయారు. అనారోగ్య కారణాల రీత్యా లాలూకు లభించిన బెయిల్‌ మంగళవారం నుంచి అమల్లోకి రానుంది. దీంతో లాలూ ఈ రోజు సాయంత్రం పట్నాకు చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు