ఉద్వేగానికి లోనైన రబ్రీ దేవి

12 Apr, 2019 20:34 IST|Sakshi

పట్నా : బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ భార్య రబ్రీ దేవి ఉద్వేగానికి లోనయ్యారు. పెద్ద కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ను ఉద్దేశిస్తూ.. ‘ఇప్పటి వరకూ జరిగింది చాలు.. ఇంటికి వచ్చేయ్‌’ అంటూ అభ్యర్థించారు. లాలూ ప్రసాద్‌ పెద్ద కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌..  భార్య ఐశ్వర్యతో పొసగడం లేదు.. విడాకులు కావాలంటూ కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని జైలులో ఉన్న తండ్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు కూడా తెలియజేశాడు. ఆ తర్వాత నుంచి తేజ్‌ ప్రతాప్‌ ఇంటికి వెళ్లకుండా వేరుగా ఉంటున్నాడు. (చదవండి : బాబాయ్‌ నాకు ఇల్లు కావాలి)

ఈ నేపథ్యంలో తొలిసారి రబ్రీ దేవి మీడియా ముందు తన కుమారుని గురించి మాట్లాడారు. ‘నా కొడుకులిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. మా శత్రువులైన బీజేపీ, జేడీయూ మనుషులు నా కొడుకును తప్పు దోవ పట్టిస్తున్నారు. ప్రస్తుతం నా భర్త మాతో లేకపోవడం కూడా వారికి బాగా కలసివచ్చింది. మేం కూడా లాలూజీని చాలా మిస్‌ అవుతున్నాం. ఆయన లేకపోతే ప్రతీది నిరుపయోగమే. ఆయన త్వరలోనే వస్తాడు.. సమస్యలన్ని పరిష్కారమవుతాయ’ని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాక తాను ప్రతి రోజు తన కుమారునితో ఫోన్‌లో మాట్లాడుతున్నానని రబ్రీ దేవి తెలిపారు.

మరిన్ని వార్తలు