‘ఎగవేతదారుల్లో వారే అధికం’

28 Apr, 2020 17:26 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆర్‌బీఐ వెల్లడించిన బ్యాంకు రుణాల ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితాలో బీజేపీ సన్నిహిత మిత్రులే ఎక్కువగా ఉన్నారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. బ్యాంకులను మోసం చేసిన 50 మంది ప్రముఖ ఎగవేతదారుల జాబితాలో పాలక పార్టీ మిత్రులే ఉన్నందున బీజేపీ పార్లమెంట్‌లో ఈ జాబితాను వెల్లడించలేదని అన్నారు. అత్యధిక మొత్తంలో బ్యాంకు రుణాలను ఎగవేసిన 50 మంది పేర్లను చెప్పాలని తాను పార్లమెంట్‌లో ప్రశ్నిస్తే ఆర్థిక మంత్రి సమాధానం ఇచ్చేందుకు నిరాకరించారని రాహుల్‌ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆర్‌బీఐ వెల్లడించిన జాబితాలో నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ, ఇతర బీజేపీ మిత్రులు ఆ జాబితాలో ఉన్నారు..అందుకే పార్లమెంట్‌లో వాస్తవాలను ప్రభుత్వం కప్పిపుచ్చిందని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

సామాజిక కార్యకర్త సాకేత్‌ గోఖలే సమాచార హక్కు చట్టం కిందట కోరిన మీదట ఆర్‌బీఐ 50 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితాను అందచేసింది. ఈ జాబితా ఆధారంగా కాంగ్రెస్‌ పార్టీ పాలక బీజేపీ లక్ష్యంగా విమర్శల దాడికి పదును పెట్టింది. రుణాలు ఎగవేసి విదేశాల్లో తలదాచుకున్న నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ, విజయ్‌ మాల్యా సహా 50 మంది డిఫాల్టర్ల రుణాలను మోదీ ప్రభుత్వం రద్దు చేసిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. దేశంలో ప్రముఖ లోన్‌ డిఫాల్టర్ల జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జీవాలా వీరి రుణాలను ఎందుకు రద్దు చేశారో వెల్లడించాలని ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వ దురుద్దేశాలను ఈ జాబితా ప్రతిబింబిస్తోందని, దీనిపై ఆయన వివరణ ఇవ్వాలని నిలదీశారు.

చదవండి : ఆపత్కాలంలోనూ సొమ్ము చేసుకుంటారా!

మరిన్ని వార్తలు