ఆల్వార్: ఉద్యోగాల కల్పనలో కేంద్రం పూర్తిగా విఫలమైందని రాహుల్ ఆరోపించారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆల్వార్ జిల్లా మలాక్వారాలో రాహుల్ మాట్లాడారు. గత నెలలో ఆల్వార్ జిల్లాలో కదులుతున్న రైలు నుంచి దూకి నలుగురు యువకులు ఆత్మహత్య చేసుకున్న ఘటనను ప్రస్తావించారు.
ఈ యువకులంతా తమకు ఉద్యోగం రావట్లేదనే వేదనతో బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. అనిల్ అంబానీ సహా దేశంలోని బడా వ్యాపారవేత్తలకు మోదీ ప్రభుత్వం కొమ్ముకాస్తోందని రాహుల్ ఆరోపించారు. ప్రధాని తన ప్రతి ప్రసంగంలో ‘భారత్ మాతాకీ జై’అంటారని, దానికి బదులు అనిల్, నీరవ్, లలిత్ మోదీ, చోక్సీలకు జై కొట్టాలని ఎద్దేవా చేశారు.