మోదీ వైఫల్యాలపై హార్వర్డ్ అథ్యయనం : రాహుల్ గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ సర్కార్ చేపట్టిన నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలు విఫలమవగా తాజాగా కోవిడ్-19ను ఎదుర్కోవడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలతో పాటు కరోనా వైరస్ను దీటుగా ఎదుర్కోవడంలో ప్రభుత్వ అసమర్ధతపై హార్వర్డ్ బిజినెస్ స్కూల్ (హెచ్బీఎస్) అధ్యయనం చేపడుతుందని రాహుల్ చురకలు వేశారు. రాబోయే రోజుల్లో కోవిడ్-19తో పాటు నోట్లరద్దు, జీఎస్టీ అమలు వంటి వైఫల్యాలపై హెచ్బీఎస్ కేస్ స్టడీలు నిర్వహిస్తుందని ట్వీట్ చేశారు. జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తున్న వీడియో క్లిప్ను దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు పెరుగుతున్న గ్రాఫ్ను రాహుల్ అటాచ్ చేశారు. దేశంలోని పలు కొత్త ప్రాంతాలకు కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్నా మహమ్మారిని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళికా లేదని దుయ్యబట్టారు.
కోవిడ్-19 వేగంగా విస్తరిస్తున్నా ప్రధాని మౌనముద్ర దాల్చారని మండిపడ్డారు. కరోనా వైరస్ను కట్టడి చేయడంలో మోదీ సర్కార్ ఘోరంగా విఫలమైందని రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. వైరస్ కట్టడి, దాని ప్రభావాల గురించి రాహుల్ ఇటీవల పలు రంగాలకు చెందిన నిపుణులు, నేతలతో వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించారు. కాగా, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా దాదాపు 25 వేల పాజిటివ్ కేసులు నమోదవగా 613 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6.9 లక్షలుగా నమోదైంది. దీంతో 6.8 లక్షల కేసులున్న రష్యాను వెనక్కునెట్టి ప్రపంచంలో కరోనా ప్రభావిత జాబితాలో భారత్ మూడో స్థానానికి ఎగబాకిందని అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. చదవండి : మేక్ ఇన్ ఇండియా అంటూ చైనావే కొంటోంది