అతడు ఔరంగజేబ్‌..అలాఉద్దిన్‌ ఖిల్జి

22 Nov, 2017 19:25 IST|Sakshi

సాక్షి,అహ్మదాబాద్‌: కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాహుల్‌ అక్కడి దేవాలయాలను సందర్శించడంపై బీజేపీ స్పందిస్తూ ఔరంగజేబ్‌, అలాఉద్దిన్‌ ఖిల్జిల బాటలో ఆయన పయనిస్తున్నారని వ్యాఖ్యానించింది. తన పాలనలో ఎన్నో దేవాలయాలను ధ్వంసం చేసిన మొగల్‌ సామ్రాజ్యాధినేత ఔరంగజేబ్‌ దీన్ని సామాన్యులు వ్యతిరేకిస్తే రెండు మూడు దేవాలయాలు నిర్మిస్తానని హామీ ఇచ్చేవారని, ఖిల్జీ సైతం ఇదే మాదిరి వ్యవహరించేవారని బీజేపీ ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు అన్నారు.

ప్రస్తుతం రాహుల్‌ వీరి బాటలో పయనిస్తున్నారని ఆరోపించారు.గుజరాత్‌లో ఇటీవల తన పర్యటన సందర్భంగా రాహుల్‌ అక్షర్‌ధామ్‌ సహా పలు ఆలయాలను సందర్శించారు. హిందువుల ఓట్లను ఆకట్టుకునేందుకే రాహుల్‌ ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని జీవీఎల్‌ ఆరోపించారు.

రాహుల్‌ ఆలయాలను సందర్శించడం డ్రామా అని ఎన్నికల కోసమే ఆయన ఈ నాటకానికి తెరలేపారని విమర్శించారు.

మరిన్ని వార్తలు