పరువు నష్టం కేసులో రాహుల్‌కు బెయిల్‌

12 Jul, 2019 16:57 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అహ్మదాబాద్‌ జిల్లా సహకార బ్యాంక్‌ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి బెయిల్‌ మంజూరైంది. ఈ కేసు విచారణ సందర్భంగా శుక్రవారం మెట్రపాలిటన్‌ కోర్టు న్యాయమూర్తి రాహుల్‌ను నేరాన్ని మీరు అంగీకరిస్తారా అని అడగ్గా తాను నేరగాడ్ని కాదని ఆయన బదులిచ్చారు. అహ్మదాబాద్‌ మెట్రపాలిటన్‌ కోర్టులో జరిగిన కేసు విచారణకు రాహుల్‌ స్వయంగా హాజరయ్యారు. రూ 15,000 పూచీకత్తుపై రాహుల్‌కు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

నోట్ల రద్దు జరిగిన అయిదు రోజుల తర్వాత అహ్మదాబాద్‌ జిల్లా సహకార బ్యాంక్‌లో రూ 745.59 కోట్ల నల్ల ధనాన్ని అసలైన నోట్లతో మార్చుకున్నారని రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జీవాలా చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం కేసు నమోదైంది. ఈ బ్యాంక్‌ డైరెక్టర్లలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఒకరు కావడం గమనార్హం. ఈ కేసులో వీరిద్దరిపై ప్రాధమిక సాక్ష్యాధారాలు లభించడంతో ఈ ఏడాది ఏప్రిల్‌ 9న వీరికి కోర్టు సమన్లు జారీ చేసింది. తమ బ్యాంక్‌పై కాంగ్రెస్‌ నేతలు నిరాధార, తప్పుడు ఆరోపణలు చేసి తమ ప్రతిష్టకు భంగం కలిగించారని బ్యాంకు తన ఫిర్యాదులో పేర్కొంది.

మరిన్ని వార్తలు