లక్నో: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కనబడుట లేదనే పోస్టర్లు ఆయన సొంత నియోజకవర్గం అమేథిలో కలకలం సృష్టించాయి. రాహుల్ గాంధీ ఫోటోతో ‘అమేథి ఎంపీ రాహుల్ గాంధీ ఎక్కడున్నారో తెలియజేస్తే బహుమానం అందజేస్తామని’ గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు అంటించారు. అమేథి ఓటర్లను రాహుల్ తీవ్రంగా నిరాశపరిచాడని అమేథీ ప్రజలు భావిస్తున్నట్లు పోస్టర్లలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం ఇది బీజేపీ పార్టీ పనేనని ఆరోపించారు.
ఇక రాహుల్ అమేథీ నియోజకవర్గంలో పర్యటించక 6 నెలలవుతుంది. మార్చిలో జరిగిన యూపీ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో రాహుల్ అమెథీ రావడానికి సుముఖంగా లేడని తెలుస్తోంది. ఈ పోస్టర్లతో రాహుల్ నియోజక వర్గ అభివృద్ధికి కృషి చేయడం లేదనే నింద వేస్తున్నారని, త్వరలోనే రాహుల్ను కలిసి అమేథీలో పర్యటించేలా చేయాలని స్థానిక కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.