‘ఆయనను ఎప్పుడూ అగౌరవపరచలేదు’

18 Feb, 2020 11:06 IST|Sakshi

న్యూఢిల్లీ: దోషులుగా తేలిన చట్టసభల సభ్యులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో విభేదిస్తూ నాటి యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌పై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం విషయం తెలిసిందే. అయితే ఆనాటి సంఘటన మాజీ ప్రధాని మన్మోహన్‌కు ఇబ్బందికర పరిస్థితిని తీసువచ్చిందని మాజీ ప్రణాళికా సంఘం అధ్యక్షుడు అహ్లూవాలియా ఇటీవల వెల్లడించారు. ఈ విషయంపై కాంగ్రెస్‌ ముఖ్య ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా స్పందించారు. 2013 నాటి ఆర్డినెన్స్‌ సమయంలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, రాహుల్‌ గాంధీకి మధ్య ఏం జరిగిందో తెలియదు.. గానీ, మన్మోహన్‌ను.. రాహుల్‌ గాంధీ ఒక మార్గదర్శి, గురువుగా భావించేవారని తెలిపారు. కాంగ్రెస్‌పార్టీ కూడా ఏనాడు మన్మోహన్‌ సింగ్‌ను అగౌరవపరచలేదని అయన స్పష్టం చేశారు. (ప్రశాంత్‌కిశోర్‌కు జడ్‌ కేటగిరీ భద్రత !)

కాగా, అన్ని పార్టీలు దోషులుగా తేలినవారిని చట్టసభల్లోకి అనుమతించాలని చేసే చట్టానికి ఆమోదం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో రాజకీయాలను శుభ్రపరిచి.. పార్టీ స్థాయిని పెంచే నాయుకుడిగా రాహుల్‌ ప్రవర్తించారని సుర్జేవాలా తెలిపారు. ‘ఆర్డినెన్స్‌ కాగితాల్ని చింపడం సమస్య కాదు. స్వచ్ఛమైన రాజకీయాల్లో నేరస్తులు ఉండాలా.. వద్దా.. అనేది సమస్య’ అని ఆయన అన్నారు. ఈ ఘటన తర్వాత సుప్రీంకోర్టు ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు వారిపై ఉన్న కేసులను బహిరంగపరచాలని అన్నిపార్టీలకు ఆదేశాలు జారీ చేసిందని సుర్జేవాలా గుర్తు చేశారు.

>
మరిన్ని వార్తలు