‘ఆ స్ధానంలో ఎవరున్నా అలాగే అంటా’

13 Jan, 2019 11:12 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్‌ డీల్‌పై ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌పై ఇటీవల తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ సమర్ధించుకున్నారు. నిర్మలా సీతారామన్‌ స్ధానంలో పురుషుడున్నా తాను ఇలాగే మాట్లాడి ఉండేవాడినని రాహుల్‌ స్పష్టం చేశారు. దుబాయ్‌లో ఆదివారం విలేకరులతో మాట్లాడిన రాహుల్‌ పార్లమెంటల్‌లో రఫేల్‌ డీల్‌పై ప్రధాని తన వైఖరిని సమర్ధించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు.

‘రఫేల్‌ ఒప్పందంలో అనిల్‌ అంబానీకి ప్రధాని నరేంద్ర మోదీ రూ 30,000 కోట్లు దోచిపెట్టారు..అయితే లోక్‌సభలో తనను సమర్ధించుకోవాల్సిన ప్రధాని మోదీ తన తరపున మరో మనిషిని పంపారు..యాధృచ్చికంగా ఆమె మహిళ (నిర్మలా సీతారామన్‌)అయ్యారు..ఆ స్ధానంలో పురుషుడున్నా నేను అలాంటి వ్యాఖ్యలే చేస్తా’ నని రాహుల్‌ వ్యాఖ్యానించారు.

తాను మహిళలను అవమానించినట్టు బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని రాహుల్‌ తోసిపుచ్చారు. మీ భావజాలాన్ని నాపై రుద్దవద్దని బీజేపీ నేతలను ఉద్దేశించి పేర్కొన్నారు. కాగా రఫేల్‌ ఒప్పందంపై చర్చ జరుగుతుంటే పార్లమెంట్‌ నుంచి పారిపోయిన ప్రధాని నరేంద్ర మోదీ ఓ మహిళ (నిర్మలా సీతారామన్‌) వెనుక దాక్కున్నారని రాహుల్‌ ఎద్దేవా చేసిస సంగతి తెలిసిందే. మరోవైపు నిర్మలా సీతారామన్‌పై వ్యాఖ్యలతో రాహుల్‌ మహిళలను అవమానించారని ప్రధాని నరేంద్ర మోదీ అభ్యంతరం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు