ఆస్ధాన మోదీ ఆస్ధానవాసే..

22 Oct, 2018 10:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకు ప్రధాని నరేంద్ర మోదీ సీబీఐని ఆయుధంలా ప్రయోగిస్తున్నారని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. ముడుపుల కుంభకోణంలో సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేష్‌ ఆస్థానా పాత్రపైనా రాహుల్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీబీఐ ఉన్నతాధికారి ఆస్ధానాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైన సంగతి తెలిసిందే.

‘ప్రధానికి ఆప్తుడైన గుజరాత్‌ కేడర్‌కు చెందిన గోద్రా సిట్‌ ఫేమ్‌ ఆస్ధానా ఇప్పుడు ముడుపులు స్వీకరిస్తూ పట్టుబడ్డా’రని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. అవినీతిని రూపుమాపాల్సిన సీబీఐలోనే అంతర్గత యుద్ధం సాగుతోందని ఎద్దేవా చేశారు. ప్రధాని సారథ్యంలో సీబీఐ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పరికరంలా మారిందని రాహుల్‌ ధ్వజమెత్తారు.

ఆస్ధానా నేతృత్వంలోని సిట్‌ విచారణ చేపట్టిన మొయిన్‌ ఖురేషి అవినీతి కేసులో వ్యాపార వేత్త నుంచి ముడుపులు డిమాండ్‌ చేసి, స్వీకరించిన కేసులో ఆస్థానాను సీబీఐ ప్రధాన నిందితుడిగా పేర్కొంది. ఆరు అవినీతి కేసుల్లో ఆస్ధానాపై విచారణ చేపట్టామని సెప్టెంబర్‌ 21న సీబీఐ కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌కు నివేదించింది.

>
మరిన్ని వార్తలు