‘కశ్మీర్‌ ఎల్లప్పుడూ భారత్‌లో అంతర్భాగమే’

28 Aug, 2019 12:29 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌కి పత్యేక ప్రతిపత్తి రద్దు చేసినప్పటి నుంచి అంతర్జాతీయ వేదికపై భారత్‌ను ఇరకాటంలో పెట్టాలని పాకిస్తాన్‌ ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో పాక్‌ కశ్మీర్‌కు వ్యతిరేకంగా పలు పిటిషన్లు వేసి ఐక్యరాజ్య సమితి తలుపు తట్టింది. ఈ నేపథ్యంలో  పాకిస్తాన్‌..  కశ్మీర్‌పై చేసే ఆరోపణలను కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ సోషల్‌ మీడియా వేదికగా ఖండించారు. ‘జమ్మూ కశ్మీర్‌ అంశం పూర్తిగా భారతదేశ అంతర్గత సమస్య, కశ్మీర్‌లో హింసాత్మక వాతావరణం ఏర్పడటానికి పాకిస్తాన్‌ చర్యలే కారణం’ అని  తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

కాగా రాహుల్‌ గాంధీ, విపక్షనేతలు కశ్మీర్‌ పర్యటన వెళ్లి శనివారం ఎయిర్‌పోర్టు నుంచి వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ‘ పాకిస్తాన్‌ కశ్మీర్‌ అంశంపై పలు పిటిషన్లతో ఉద్దేశపూర్వకంగా అసత్యాలను వ్యాప్తి చేస్తుందన్నారు. ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేపట్టిన విధానాలను మాత్రమే తాను విమర్శించానని చెప్పారు. కానీ, కశ్మీర్‌ అంశం కేవలం భారత్‌కు సంబంధించిన విషయమని.. ఇందులో ఏ ఇతర దేశాలు జోక్యం చేసుకోరాదని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇక రాహుల్‌ గాంధీ ట్వీట్‌పై.. కాంగ్రెస్‌ ఎంపీ శశీథరూర్‌  స్పందిస్తూ.. కశ్మీర్‌ భారత దేశ అంతర్గత అంశమని.. 370 అధికరణను కేం‍ద్రంలో ఉన్న బీజేపీ ప్రభు‍త్వం రద్దు చేసిన విధానం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలపై దాడి చేయడమన్నారు. కశ్మీర్‌పై మా నిర్ణయం నుంచి పాకిస్తాన్‌ ఎటువంటి లబ్ధి పొందడానికి వీలు లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు