దూబే ఎన్‌కౌంటర్‌పై స్పందించిన రాహుల్‌

10 Jul, 2020 16:08 IST|Sakshi

యూపీ సర్కార్‌కు చురకలు

సాక్షి, న్యూఢిల్లీ : గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్‌పై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్పందించారు. దూబే ఎన్‌కౌంటర్‌పై విపక్షాలు సందేహాలు వ్యక్తం చేస్తున్న క్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వానికి కాంగ్రెస్‌ ఎంపీ చురకలు వేశారు. దూబే ఎన్‌కౌంటర్‌ సహా ఏ ఒక్కరినీ నేరుగా ప్రస్తావించకుండా ఈ వ్యవహారంలో యూపీ ప్రభుత్వ తీరును ఎండగడుతూ  రాహుల్‌ ట్వీట్‌ చేశారు. ‘ఎన్నో సమాధానాలకు మౌనమే సమాధానం..మౌనం వెనుక ఎన్ని ప్రశ్నలను దాచారో తెలియద’ని రాహుల్‌ వ్యాఖ్యానించారు. ఎన్‌కౌంటర్‌లో వికాస్‌ దూబేను హతమార్చడంపై విపక్షాలు సీబీఐ విచారణకు డిమాండ్‌ చేశాయి. దూబే ఎన్‌కౌంటర్‌పై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయని కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబల్‌ అన్నారు.

రాజకీయ నేతలతో గ్యాంగ్‌స్టర్‌ సంబంధాలు బయటపడతాయనే భయంతోనే ఆయనను ఎన్‌కౌంటర్‌ చేశారని పలువురు భావిస్తున్నారని చెప్పారు. గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో గురువారం పట్టుబడ్డ అతడిని ఈరోజు ప్రత్యేక వాహనంలో కాన్పూర్‌కు తరలిస్తుండగా.. పోలీసుల ఎస్కార్ట్‌లోని ఆ వాహనం బోల్తా పడింది. దీనిని అదునుగా తీసుకున్న వికాస్‌ పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో గాయపడిన అతడిని కాన్పూర్‌ ఆస్పత్రికి తరలించగా అతడు మరణించాడు. వికాస్‌ దూబేపై హత్య కేసులు సహా మొత్తం 60 క్రిమినల్‌ కేసుల్లో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నాడని పోలీసులు చెప్పారు.చదవండి : ‘ఎకానమీపై హెచ్చరిస్తే ఎద్దేవా చేశారు’

మరిన్ని వార్తలు