దళిత యువకులపై దాడి అమానుషం : రాహుల్‌

20 Feb, 2020 19:56 IST|Sakshi

న్యూఢిల్లీ : రాజస్థాన్‌లో ఇద్దరు దళిత వ్యక్తులు చోరీకి యత్నించారనే కారణంతో స్క్రూ డ్రైవర్‌తో చిత్రహింసలు పెట్టి దుకాణ యజమాని, సిబ్బంది అత్యంత అమానవీయంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే దీనిపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్విటర్‌ వేదికగా స్పందించారు.' ఆ ఇద్దరు యువకులపై చేసిన అమానుష దాడి నన్ను ఎంతగానో బాధించింది. ఆ యువకులపై సిబ్బంది దాడి చేసిన తీరు నా ఒళ్లు గగుర్పొడిచేలా అనిపించింది. వెంటనే దీనిపై రాజస్తాన్‌ ప్రభుత్వం స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా' అని పేర్కొన్నారు. (స్క్రూ డ్రైవర్‌తో చిత్ర హింసలు పెడుతూ..)

రాజస్తాన్‌కు చెందిన ఇద్దరు దళిత వ్యక్తులు నాగౌర్‌ పట్టణ సమీపంలోని ఓ పెట్రోల్‌ బంకులో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి రూ. 50 వేలు దొంగతనానికి పాల్పడ్డారంటూ తోటి ఉద్యోగులు వారిపై దాడికి దిగారు. విచక్షణా రహితంగా కొడుతూ.. స్క్రూ డ్రైవర్‌తో చిత్ర హింసలు పెట్టారు. అనంతరం వారి దుస్తులు చించి... పెట్రోల్‌ పోశారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి బయటపడ్డ బాధితులు.. బుధవారం పోలీసులను ఆశ్రయించారు. తమపై తోటి ఉద్యోగులే దాడి చేశారని.. ఆ తతంగాన్ని కెమెరాలో రికార్డు చేశారని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఘటనపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇద్దరు యువకులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. (అది రాజస్థాన్‌లో జరిగిన ‘ఘోరం’)

మరిన్ని వార్తలు