రైతు ఆత్మహత్య గురించి విచారణ చేయాలంటూ అభ్యర్థన

31 May, 2019 20:05 IST|Sakshi

తిరువనంతపురం : సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అమేథీలో ఓడిపోగా.. వయనాడ్‌లో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కేరళ నుంచి గెలిచిన తర్వాత తొలిసారి రాహుల్‌ గాంధీ నియోజకవర్గ సమస్యలపై స్పందించారు. ఈ నెల 25న వయనాడ్‌కు చెందిన ఓ రైతు అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయంపై స్పందించిన రాహుల్‌ గాంధీ.. పూర్తి స్థాయి విచారణ జరిపి సదరు రైతు కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు లేఖ రాశారు. రైతు ఆత్మహత్య విషయం తనకు ఎంతో బాధ కల్గించిందని రాహుల్‌ లేఖలో పేర్కొన్నారు.

ఈ సమస్యను పట్టించుకోకుండా ఇలానే వదిలేస్తే.. త్వరలోనే మరింత మంది రైతులు ఇదే మార్గాన్ని ఎన్నుకుంటారని రాహుల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాక ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనేందుకు కేరళ ప్రభుత్వం కృషి చేయాలని అందుకు తన పూర్తి మద్దతు ఉంటుందని రాహుల్‌ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు