పౌరసత్వ బిల్లుపై రాహుల్‌ ఫైర్‌

10 Dec, 2019 14:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ బిల్లుపై కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. ఈ బిల్లు దేశ పునాదులను ధ్వంసం చేస్తుందని దుయ్యబట్టారు. మహారాష్ట్రలో తమ కొత్త భాగస్వామ్య పక్షం శివసేన పౌరసత్వ బిల్లు దేశ ప్రయోజనాలను పరిరక్షిస్తుందని ప్రశంసించిన నేపథ్యంలో రాహుల్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పౌరసత్వ సవరణ బిల్లును రాజ్యాంగంపై దాడిగా రాహుల్‌ అభివర్ణించారు. ఈ బిల్లుపై సర్కార్‌ను సమర్ధించిన వారు దేశ పునాదులను విచ్ఛిన్నం చేయడానికి సహకరించిన వారవుతారని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఆప్ఘనిస్తాన్‌ల నుంచి వచ్చిన ముస్లిమేతర శరణార్ధులకు భారత పౌరసత్వం కల్పించేందుకు వెసులుబాటు ఇచ్చిన పౌరసత్వ సవరణ బిల్లును సోమవారం లోక్‌సభ ఆమోదించింది. మరోవైపు మహారాష్ట్రలో పాలక సంకీర్ణ సర్కార్‌కు సారథ్యం వహిస్తున్న శివసేన వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతిచ్చింది. జాతి ప్రయోజనాల కోసం తాము ఈ బిల్లుకు మద్దతిచ్చిందని ఆ పార్టీ నేత, ఎంపీ అర్వింద్ సావంత్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు