అయోధ్యలో రాహుల్

10 Sep, 2016 04:40 IST|Sakshi
అయోధ్యలో రాహుల్

 26 ఏళ్ల తర్వాత నెహ్రూ-గాంధీ కుటుంబ వ్యక్తి పర్యటన

అయోధ్య:
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం అయోధ్యలో పర్యటించారు. 1992 నాటి బాబ్రీ మసీదు ఘటన తర్వాత నెహ్రూ-గాంధీ కుటుంబంలో ఒక వ్యక్తి ఇక్కడ పర్యటించడం ఇదే ప్రథమం. అయితే ఆయన వివాదాస్పద రామజన్మభూమి, బాబ్రీ మసీదు స్థలానికి మాత్రం వెళ్లలేదు. ఆ ప్రాంతానికి కిలో మీటరు దూరంలో ఉన్న హనుమాన్‌గడీ ఆలయంలో పూజలు చేశారు. అంతకుముందు వీహెచ్‌పీకి వ్యతిరేకిగా పేరున్న మహంత్ జ్ఞాన్ దాస్‌తో చర్చలు జరిపారు.

భేటీ తర్వాత జ్ఞాన్ దాస్ మాట్లాడుతూ..తన ఆశీస్సుల కోసం రాహుల్ వచ్చారని చెప్పారు. రామజన్మభూమి విషయంలో సుప్రీం కోర్టు చెప్పిన దానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందని రాహుల్ చెప్పినట్లు తెలిసింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ముందు కాంగ్రెస్‌పై ఉన్న హిందూ వ్యతిరేకి అన్న విమర్శను తుడిచిపెట్టడానికే రాహుల్ అయోధ్యలో పర్యటించారని విమర్శకుల అంచనా. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సూచనలో భాగంగా రాహుల్ హనుమాన్ గుడిని సందర్శించారని తెలుస్తోంది. ఇక తన రోడ్ షో ప్రారంభానికి ముందు కిచాయుచా షరీఫ్ దర్గాకు రాహుల్ వెళ్లారు. ఇది బ్రాహ్మణ, ముస్లిం, ఓబీసీ ఓట్లను దృష్టిలో పెట్టుకుని కిశోర్ రూపొం దించిన వ్యూహమని భావిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు