ఇలాగైతే.. అంతా హైఫై..

9 Jul, 2014 01:12 IST|Sakshi
ఇలాగైతే.. అంతా హైఫై..

ఆఫీసు పనిమీద ముంబై వెళుతున్నారు.. జస్ట్ మీ మొబైల్ ఫోన్‌తోనే టికెట్ బుక్ చేసుకున్నారు.. స్టేషన్‌కు వెళ్లగానే పూర్తి పరిశుభ్రంగా ఉన్న ఆవరణ మీకు స్వాగతం పలికింది.. మెట్లెక్కే శ్రమ ఏమాత్రం లేకుండా ‘ఎస్కలేటర్’పై నుంచుని కావాల్సిన ప్లాట్‌ఫాంపైకి వెళ్లారు.. రైలుకు ఇంకా సమయం ఉండడంతో అక్కడే ఉన్న ‘ఫుడ్ కోర్ట్’కు వెళ్లి పిజ్జా తిన్నారు.. తర్వాత ‘రెస్ట్ రూమ్’కెళ్లి హాయిగా కూర్చున్నారు.. అక్కడే మీ ల్యాప్‌టాప్ తీసి స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఉచిత వైఫై ఇంటర్‌నెట్‌కు అనుసంధానమై పనిచేసుకుంటున్నారు.. ఇంతలో రైలు రాబోతోందని మీ ఫోన్‌కు కాల్ వచ్చింది.. లేచివెళ్లి రెలైక్కారు.. మీ సీట్లో కూర్చుని రైల్లోనూ ఏర్పాటు చేసిన వైఫైతో ఇంటర్‌నెట్‌లో విహరించారు.. ఆకలైతే చిన్న ఎస్సెమ్మెస్‌తో మీక్కావాల్సిన దానికి ఆర్డరిచ్చారు.. వచ్చే స్టేషన్‌లోనే రుచిగా, శుచిగా ఉన్న భోజనం మీ వద్దకు వచ్చేసింది.. ఈ లోగా టీసీకి మీ మొబైల్‌కు వచ్చిన ‘టికెట్ సందేశా’న్ని చూపించేశారు.. తర్వాత మీ వద్దకు వచ్చిన ‘హౌస్ కీపింగ్’ సిబ్బందితో మ్యాగజైన్, మంచినీళ్లు తెప్పించుకున్నారు.. కాసేపటికి నిద్రపోయారు.. మీరు దిగాల్సిన స్టేషన్ రావడానికి కొద్ది నిమిషాల ముందు ‘మీ స్టేషన్ రాబోతోంద’ంటూ ఫోన్‌కాల్ వచ్చింది.. లేచి బ్యాగ్ సర్దుకోగానే స్టేషన్ వచ్చేసింది.. రైలుదిగి ముందుగానే బుక్ చేసుకున్న వీఐపీ రెస్ట్‌రూమ్‌కు వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు.. అక్కడే కాస్త రెడీ అయ్యి వచ్చిన పనిమీద నగరంలోకి వెళ్లారు.
 
 - రైల్వే మంత్రి బడ్జెట్‌లో పేర్కొన్న అంశాలన్నీ వాస్తవ రూపం దాల్చితే.. త్వరలో అందుబాటులోకి వచ్చే సౌకర్యాలివి!
 ఇంతేకాదు.. కాయిన్ వేసి ప్లాట్‌ఫాం టికెట్ తీసుకునేలా వెండింగ్ యంత్రాలు.. పోస్టాఫీసుల్లో రైలు టికెట్లు.. ఇంటర్‌నెట్‌లో ప్లాట్‌ఫాం, అన్ రిజర్వుడ్ టికెట్లు, ‘రెస్ట్ రూమ్’ను బుక్ చేసుకునే అవకాశం.. ఏ రైలు ఏ సమయంలో ఎక్కడ ప్రయాణిస్తోందో తెలుసుకునే ఏర్పాట్లు.. స్టేషన్లు, రైళ్లలో మినరల్ వాటర్ అందించే ఏర్పాట్లు.. బయో టాయిలెట్లు.. విస్తృతంగా సీసీ కెమెరాలు.. వంటి సౌకర్యాలెన్నో అందుబాటులోకి రానున్నాయి.
 
ప్రగతికారకం, మార్గదర్శకం

 
ఈ రైల్వే బడ్జెట్ ప్రగతికారకం, మార్గదర్శకం. పారదర్శకమైన, సంస్థాగతంగా రైల్వేను బలోపేతం చేయగలిగిన బడ్జెట్‌ను సదానంద గౌడ ప్రవేశపెట్టారు. సాధారణ ప్రజలకు ప్రయోజనం కలిగేలా తక్కువ సమయంలోనే రైల్వేకు మంచి దిశానిర్దేశం చేశారు. సాధారణ ప్రజలకు ఉత్తమ సేవలు అందించేలా, వేగవంతమైన అభివృద్ధితోపాటు భద్రత కల్పించేలా రైల్వే బడ్జెట్ ఉంది.     - నరేంద్ర మోడీ, ప్రధాని
 
6 నెలలకోసారి చార్జీల సవరణ

ప్రయాణ చార్జీలను ప్రతి ఆరునెలలకూ సవరించేందుకు ఇంధన ధరల సర్దుబాటు అంశాన్ని (ఎఫ్‌ఏసీని) ప్రాతిపదికగా తీసుకునే ప్రక్రియను కొనసాగిస్తాం. గతంలో యూపీఏ ప్రభుత్వం ప్రతిపాదించిన రైల్వే టారిఫ్ అథారిటీ ఏర్పాటుపై అధ్యయనం చేస్తున్నాం. బుల్లెట్ రైళ్లపై ఒక సర్వే నివేదిక అందింది. మరో నివేదిక వచ్చే నెలాఖరుకు రావచ్చు. నివేదిక అందగానే నిర్ణయం తీసుకుంటాం. రైల్వే స్టేషన్లను ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయడంలో ప్రైవేటు పెట్టుబడిదారుల ప్రమేయంపై పెట్టుబడిదారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.

 - విలేకరులతో రైల్వే మంత్రి సదానందగౌడ
 
నిజాయతీ గల బడ్జెట్ ఇది

 రైల్వే బడ్జెట్ వాస్తవాలను ప్రతిబింబించేదిగా ఉన్న ఒక నిజాయితీ కలిగిన బడ్జెట్. గడిచిన కొన్నేళ్లుగా నిర్వహణ లోపం వల్ల భారత రైల్వే కష్టాల పాలయింది. త్వరితగతిన ప్రాజెక్టులు పూర్తిచేయాలన్న కేంద్రం కొత్త ఆలోచనను ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తోంది. జనార్షక, అవాస్తవిక బడ్జెట్ల కంటే హేతుబద్ధమైన నిర్వహణే మేలు చేస్తుంది.
 
- వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి
 
 

మరిన్ని వార్తలు