రైలు చార్జీల పెంపు కూత?

4 Oct, 2013 01:15 IST|Sakshi

ప్రతిపాదనపై త్వరలోనే నిర్ణయం: మంత్రి ఖర్గే
 న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణ చార్జీల పెంపు ప్రతిపాదన పరిశీలనలో ఉందని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని రైల్వే మంత్రి మల్లికార్జున్ ఖర్గే వెల్లడించారు. బడ్జెట్‌లో ప్రకటించిన ప్రకారం ఇంధన సర్దుబాటు చార్జీల (ఎఫ్‌ఏసీ)ను అనుసరించి చార్జీలు అక్టోబర్ 1 నుంచి అమలు చేయాల్సి ఉంటుందని మంత్రి గురువారం నాడిక్కడ చెప్పారు. సంస్థ వ్యయం, మార్కెట్ పరిస్థితులకనుగుణంగా ప్రయాణికుల చార్జీలు, సరుకుల రవాణా రుసుములపై ప్రతీ ఆర్నెల్లకోసారి సమీక్షించాలని రైల్వే యోచిస్తున్న సంగతి తెలిసిందే.
 
 ఈ లెక్కల ప్రకారం వచ్చే ఆర్నెల్లలో ఇంధనం, ఇతర ఉత్పత్తి వ్యయం పెంపు దృష్ట్యా రైల్వే రూ. 1,200 కోట్ల భారం భరించాల్సి ఉంటుంది. ఈ ఏడాది ప్రయాణికుల సేవలపై ప్రభుత్వం ఇస్తున్న క్రాస్ సబ్సిడీ ఇప్పటికే రూ. 26,000 కోట్లు దాటింది. సరుకు రవాణా రుసుం గత ఏప్రిల్ నుంచి ఎఫ్‌ఏసీ ఆధారంగా అమలు చేస్తున్న సంగతి విదితమే. ఈ ఏడాది జనవరిలోనే ప్రయాణికుల చార్జీలను పునఃసమీక్షించాల్సి ఉన్నప్పటికీ వాటిని ముట్టుకోలేదు. ఇంధన ధరల పెంపుతో పడుతున్న రూ. 850 కోట్ల అదనపు భారాన్నీ రైల్వేనే భరిస్తోంది.

>
మరిన్ని వార్తలు