రూ.115కోట్లుతో రైల్వే లైన్‌.. రోజు ఆదాయం రూ.20

18 Jan, 2020 15:05 IST|Sakshi

భువనేశ్వర్‌: ఎంత చిన్న రైల్వే స్టేషన్ అయినా రోజు మొత్తం మీద ఒక్క ప్యాసింజర్ రైలైనా నడవాల్సిందే. ఆ స్టేషన్‌లో ఆగి ప్రయాణికులను ఎక్కించుకుని వారి గమ్యస్థానాలకు చేర్చాల్సిందే. రైల్వే శాఖలో అత్యంత చిన్న రైల్వే స్టేషన్ తీసుకుని దాని నిర్వహణకు అయ్యే ఖర్చులను చూసుకున్నా.. ఏకంగా నెలకు మూడున్నర లక్షల రూపాయలు కేవలం జీతబత్యాలకే సరిపోతుందని అంచనా. అయితే కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖపై ఎంతటి ఆదాయం గడిస్తుందో అందరికీ తెలిసిందే.

అయితే.. ఒడిషా రాష్ట్రంలోని ఓ రైల్వే స్టేషన్‌‌లో ఎంత ఆదాయం వస్తుందో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం. ఒడిశాలోని బొలంగిర్‌ జిల్లాలో బిచ్చుపాలి రైల్వేస్టేషన్‌కు వస్తున్న ఆదాయం రోజుకు అక్షరాలా రూ.20 మాత్రమే. ఇద్దరంటే ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ఆ రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. బొలాంగిర్‌-బిచ్చుపాలి మధ్య 16.8కిలోమీటర్ల మేర దాదాపు రూ.115కోట్లు ఖర్చు పెట్టి ఈ రైల్వేలైన్‌ నిర్మించారు. గతేడాది జనవరి 15న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ రైల్వే స్టేషన్‌ ప్రారంభమైంది.

ఎప్పుడు చూసినా రైల్వే స్టేషన్‌ ఖాళీగా కనిపిస్తుండటంతో అసలు ఈ రైల్వేస్టేషన్‌ ఆదాయమెంత అంటూ బొలాంగిర్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త హేమంత పాండ సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయించారు. దీనికి సంబల్‌పూర్‌ డివిజన్‌ అధికారులు ఇచ్చిన సమాధానంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే.. సోనేపూర్‌ రైల్వేలైన్‌కు దీన్ని కనెక్ట్‌ చేస్తే ఈ స్టేషన్‌ ఆదాయం పెరుగుతుందని ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే చీఫ్‌, పబ్లిక్‌ రిలేషన్‌ అధికారి జేపీ మిశ్రా తెలిపారు.

మరిన్ని వార్తలు