రైల్వే ప్రయాణికులకు షాక్‌..!

31 Dec, 2019 19:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కొత్త ఏడాది తొలిరోజు నుంచే రైల్వే ప్రయాణికులకు షాక్‌ తగలనుంది. రైలు చార్జీలను మంగళవారం అర్ధరాత్రి నుంచి పెంచుతున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అన్ని తరగతుల ప్రయాణీకుల చార్జీలను స్వల్పంగా పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది. ఆర్డినరీ, నాన్‌-ఏసీ రైళ్లలో కిలోమీటర్‌కు పైసా చొప్పున, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో కిలోమీటర్‌కు రెండు పైసలు చొప్పున చార్జీలను పెంచారు. ఏసీ క్లాస్‌కు కిలోమీటర్‌కు 4 పైసల చొప్పున చార్జీలను పెంచినట్టు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఐదేళ్ల నుంచి రైల్వే చార్జీలను పెంచని దృష్ట్యా రైలు చార్జీలను హేతుబద్ధీకరించామని వెల్లడించింది. చివరిసారిగా 2014-15లో రైలు చార్జీలను పెంచారు. చార్జీల పెంపుతో పాటు రైళ్లలో ప్రయాణీకుల వసతి, సౌకర్యాలను మెరుగుపరుస్తామని, కోచ్‌ల ఆధునీకరణ, స్టేషన్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు