నేటి నుంచే రైల్వే బుకింగ్స్‌

21 May, 2020 06:22 IST|Sakshi

ఏసీ, నాన్‌ ఏసీ తరగతులతో జూన్‌ 1 నుంచి రైళ్లు

న్యూఢిల్లీ:  దేశవ్యాప్తంగా జూన్‌ 1వ తేదీ నుంచి దురంతో, సంపర్క్‌ క్రాంతి, జన శతాబ్ది, పూర్వా ఎక్స్‌ప్రెస్‌ వంటి ప్రముఖ రైళ్ల రాకపోకలు ప్రారంభం కానున్నాయని రైల్వేశాఖ బుధవారం ప్రకటించింది. గతంలో చెప్పినట్లుగా ఈ రైళ్లలో నాన్‌–ఎసీ తరగతి మాత్రమే కాకుండా ఏసీ తరగతి కూడా ఉంటుందని పేర్కొంది. ముందస్తు టికెట్‌ బుకింగ్‌లు ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం అవుతాయని వెల్లడించింది. జూన్‌ 1 నుంచి ప్రారంభం కానున్న 200 రైళ్ల జాబితాను రైల్వేశాఖ విడుదల చేసింది. జనరల్‌ కోచ్‌ల్లోనూ రిజర్వుడ్‌ సీట్లు ఉంటాయని తెలిపింది. టికెట్‌ రుసుములు సాధారణంగానే ఉంటాయని స్పష్టం చేసింది. గరిష్టంగా 30 రోజుల ముందు ప్రయాణానికి అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకోవచ్చని సూచించింది. 

తెలంగాణ, ఏపీలకు సంబంధించిన రైళ్లివే..
హైదరాబాద్‌–ముంబై: సీఎస్‌టీ హుస్సేన్‌సాగర్‌ ఎక్స్‌ప్రెస్‌
సికింద్రాబాద్‌–హౌరా:  ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌
హైదరాబాద్‌– న్యూఢిల్లీ: తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌
సికింద్రాబాద్‌ – దానాపూర్‌:  దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌
సికింద్రాబాద్‌– గుంటూరు: గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌
నిజామాబాద్‌– తిరుపతి: రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌
హైదరాబాద్‌– విశాఖపట్నం: గోదావరి ఎక్స్‌ప్రెస్‌
సికింద్రాబాద్‌– నిజాముద్దీన్‌: దురంతో ఎక్స్‌ప్రెస్‌
వేరే ప్రాంతాల్లో మొదలై తెలంగాణ మీదుగా నడిచే రైళ్లు..
విశాఖపట్నం–న్యూఢిల్లీ: ఏపీ ఎక్స్‌ప్రెస్‌
హౌరా–యశ్వంతపూర్‌: దురంతో ఎక్స్‌ప్రెస్‌  
ఎర్నాకులం– నిజాముద్దీన్‌: దురంతో ఎక్స్‌ప్రెస్‌
దానాపూర్‌–కేఎస్‌ఆర్‌ బెంగుళూరు: సంగమిత్ర ఎక్స్‌ప్రెస్‌

రైల్వే స్టేషన్లలో ఆహారశాలలకు అనుమతి: రైల్వే స్టేషన్లలో కేటరింగ్‌ సేవలు ప్రారంభించేందుకు, ఆహారశాలలు తెరిచేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఆహారాన్ని పార్సిళ్ల రూపంలో ఇవ్వాలని, ప్రయాణికులు ఆహారశాలల్లోనే కూర్చొని తినేందుకు వీల్లేదని స్పష్టం చేసింది.   

మరిన్ని వార్తలు