శ్రీదేవి, అక్షయ్‌పై ఠాక్రే సంచలన వ్యాఖ్యలు

19 Mar, 2018 09:32 IST|Sakshi

ముంబై : మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్‌ ఠాక్రే సంచలన ఆరోపణలు చేశారు. నీరవ్‌ మోదీ కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే శ్రీదేవి అంత్యక్రియలకు అంతలా హడావిడి చేశారని ఆరోపించారు. బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.  ఆదివారం ముంబైలో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడుతూ.. ‘మోదీ ముక్త్‌ భారత్‌’ కోసం ఆయన పిలుపునిచ్చారు. హిట్లర్‌ పాలనలా బీజేపీ సర్కారు పాలన సాగుతోందని ధ్వజమెత్తారు.

‘శ్రీదేవి గొప్ప నటి కావచ్చు కానీ ఆమె దేశానికి ఏం సేవ చేశారు? ఆమె భౌతికాయంపై త్రివర్ణ పతాకం ఎందుకు ఉంచారు? అధికార లాంఛనాలతో ఎందుకు అంత్యక్రియలు నిర్వహించారు? బీజేపీయేతర ముఖ్యమంత్రి ఇలా చేసివుంటే మీడియా గగ్గోలు పెట్టేది. మోదీ ప్రభుత్వానికి భయపడే మీడియా నోరు మెదపడం లేద’ని రాజ్‌ ఠాక్రే వ్యాఖ్యానించారు.

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌పై కూడా ఆయన విమర్శలు చేశారు. ‘అక్షయ్‌ భారతీయుడు కాదు. ఆయన పాస్‌పోర్టులో కెనడియన్‌గా ఉంది. వికీపిడియా కూడా ఆయనను భారత్‌లో పుట్టిన కెనడియన్‌గా చూపిస్తోంది. ఒకప్పటి నటుడు మనోజ్‌ కుమార్‌ అడుగుజాడల్లో నడవడానికి అక్షయ్‌ ప్రయత్నిస్తున్నార’ని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు