దేశవ్యాప్తంగా ‘చతుర్విధ జల సంరక్షణ’

26 Sep, 2018 01:47 IST|Sakshi

నీటి పరిరక్షణలో సత్ఫలితాలిస్తున్న రాజస్తాన్‌ నమూనా

రాజస్తాన్‌ నుంచి సాక్షి ప్రతినిధి: ఎడారి రాష్ట్రం రాజస్తాన్‌లో సత్ఫలితాలిస్తున్న చతుర్విధ జల సంరక్షణ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలుచేయాలని కేంద్రం యోచిస్తోంది. 2016 నుంచి ఇప్పటి వరకు 3 విడతల్లో 4 లక్షల జల సంరక్షణ నిర్మాణాలను పూర్తిచేయడంతోపాటు,1.5 కోట్ల మొక్కలను నాటి, వాటిని పరిరక్షించారు. చతుర్విధ జల సంరక్షణ కార్యక్రమాన్ని ప్రశంసించిన ప్రధాని మోదీ.. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలుచేసేందుకు కార్యాచరణ రూపొందించాలని నీతి ఆయోగ్‌ను ఆదేశించారు.

సంబంధిత పథకం తీరుతెన్నులపై నీతిఆయోగ్‌ అధ్యయనం చేస్తున్నట్లు తెలిసింది. రాజస్తాన్‌ రివర్‌ బేసిన్, స్టేట్‌ వాటర్‌ రిసోర్సెస్‌ ప్లానింగ్‌ అథారిటీకి చైర్మన్‌గా ఉన్న తెలంగాణకు చెందిన శ్రీరాం వెదిరె.. చతుర్విధ జల సంరక్షణ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాన నీటి చుక్కలను ఒడిసిపట్టి వాటిని భూమిలో ఇంకేలా చేసేందుకు 3 రకాలుగా కందకాలు తవ్వడం, వాటి కింది భాగంలో చిన్న చిన్న ఊట చెలిమలు సృష్టించడం, ఇంకా కింది ప్రాంతంలో చెరువులు, చెక్‌ డ్యాములు నిర్మించడం ఈ చతుర్విధ జల ప్రక్రియలో భాగం.

మరిన్ని వార్తలు