మనేసర్‌ రిసార్ట్స్‌ వద్ద ఉత్కంఠ

17 Jul, 2020 21:49 IST|Sakshi

రాజస్దాన్‌ పోలీసులు వర్సెస్‌ హరియాణ పోలీసులు

జైపూర్‌ : రాజస్దాన్‌లో రాజకీయ హైడ్రామా ఉత్కంఠ రేపుతోంది. తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలున్న మనేసర్‌ రిసార్ట్స్‌ వద్దకు చేరుకున్న రాజస్ధాన్‌ పోలీసులను హరియాణ పోలీసులు అడ్డుకున్నారు. అశోక్‌ గహ్లోత్‌ సర్కార్‌ను కూలదోసేందుకు కుట్రపన్నిన బీజేపీ నేతలతో రెబల్‌ ఎమ్మెల్యే భన్వర్‌లాల్‌ శర్మ మంతనాలు సాగించారని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ ఆడియో టేపులను విడుదల చేసింది. కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదు మేరకు భన్వర్‌ లాల్‌ శర్మ కోసం రాజస్ధాన్‌ పోలీసులు ఢిల్లీ సమీపంలోని మనేసర్‌ రిసార్ట్స్‌కు శుక్రవారం సాయంత్రం చేరుకున్నారు.  18 మంది సచిన్‌ పైలట్‌ వర్గానికి చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గత వారాంతం నుంచి ఈ రిసార్ట్స్‌లో గడుపుతున్నారు.

కాగా బీజేపీతో వీరు ముడుపుల వ్యవహారం నడిపారనే ఆరోపణలపై కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే భన్వర్‌ లాల్‌ శర్మ మరో ఎమ్మెల్యే విశ్వేంద్ర సింగ్‌లను సస్పెండ్‌ చేసింది. ఇక వీరి కోసం మనేసర​ రిసార్ట్స్‌కు చేరుకున్న రాజస్దాన్‌ పోలీసులను హరియాణ పోలీసులు కొద్దిసేపు అడ్డుకున్నారు. కాగా ఆడియో టేపుల వ్యవహారాన్ని రెబెల్‌ ఎమ్మెల్యేలు భన్వర్‌ లాల్‌ శర్మ, విశ్వేంద్ర సింగ్‌లు తోసిపుచ్చారు. ఈ టేపుల్లో రికార్డయింది తమ వాయిస్‌ కాదని స్పష్టం చేశారు. మరోవైపు తన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు సచిన్‌ పైలట్‌ బాహాటంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని రాజస్ధాన్‌ ముఖ‍్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ఆరోపించారు. ఇక ప్రియాంక గాంధీ సహా సీనియర్‌ కాంగ్రెస్‌ నేతల రాజీ ప్రతిపాదనలకు సచిన్‌ పైలట్‌ అంగీకరించలేదని ఆయన వర్గీయులు తేల్చిచెప్పారు. చదవండి : ‍కాంగ్రెస్‌కు కాషాయ నేతల కౌంటర్‌

మరిన్ని వార్తలు