బీజేపీపై సూపర్‌స్టార్‌ సంచలన వ్యాఖ్యలు

12 Nov, 2018 20:03 IST|Sakshi

సాక్షి, చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు భావిస్తున్నట్లుగా బీజేపీ ప్రమాదకరమైన పార్టీ అనేది నిజమేనేమో అని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ... నోట్ల రద్దు సరిగ్గా అమలు కాకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇది సుదీర్ఘంగా చర్చించాల్సిన అంశమని, ఈ విషయంపై ఒక్క మాటలో సమాధానం చెప్పటం కష్టమని పేర్కొన్నారు. బీజేపీ ప్రమాదకరమైన పార్టీ అనుకుంటున్నాయి కాబట్టే విపక్షాలు కూటమి దిశగా ఏర్పాట్లు చేస్తున్నాయేమోనని వ్యాఖ్యానించారు. 

ఇంకా మాట్లాడుతూ.. బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ సన్నిహితుడిగా గుర్తింపు పొందిన రజనీకాంత్‌.. బీజేపీ గురించి ఇలా మాట్లాడటం ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రెండేళ్ల క్రితం మోదీ పాత నోట్లను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించిన సమయంలో అందుకు మద్దతు తెలిపిన రజనీ ప్రస్తుతం ఇలా యూటర్న్‌ తీసుకోవడం వెనుక కారణాలేమిటో అనే చర్చ మొదలైంది.
 

మరిన్ని వార్తలు