మోదీ, అమిత్‌ షా కృష్ణార్జునులు: రజనీ

11 Aug, 2019 13:00 IST|Sakshi

సాక్షి, చెన్నై: జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి హోదా కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని రద్దు చేయడంపై సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ స్పందించారు. ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం భారత్‌కు, కశ్మీరీ ప్రజలకు శుభపరిణామం అన్నారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కృష్ణార్జునులు అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. కశ్మీర్‌ వ్యవహారంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారని వారిద్దరికీ రజనీ శుభాకాంక్షలు తెలిపారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రెండేళ్ల ప్రస్థానంపై లిజనింగ్‌ లెర్నింగ్‌ లీడింగ్‌ పేరుతో పుస్తకం రాసిన విషయం తెలిసిందే. చెన్నైలోని కలైవనర్‌ ఆరంగం వేదికగా ఆదివారం పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. వెంకయ్య నిర్వహించిన 330 ప్రజాకార్యక్రమాలతో పుస్తకాన్ని ప్రచురించారు. పుస్తకావిష్కరణ సందర్భంగా రజనీకాంత్‌ మాట్లాడుతూ.. కశ్మీర్‌పై కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడ్డారు. వెంకయ్య గొప్ప ఆధ్యాత్మికవేత్త అని, అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చి ఉన్నత స్థాయికి ఎదిగారని కొనియాడారు.  ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌, తమిళనాడు సీఎం సీఎం పళని స్వామి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు