రాజీవ్‌ విగ్రహానికి అవమానం 

26 Dec, 2018 03:21 IST|Sakshi

లూథియానా/చండీగఢ్‌: లూథియానాలోని సలేమ్‌ తబ్రీ ప్రాంతంలో ఉన్న మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ విగ్రహానికి మంగళవారం ఇద్దరు స్థానిక యువకులు రంగు పులమడం సంచలనమైంది. విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్‌ నేతలు వెంటనే రంగంలోకి దిగి విగ్రహాన్ని శుభ్రపరిచారు. 1984 నాటి సిక్కు అల్లర్ల ఘటనకు సంబంధించి రాజీవ్‌ గాంధీపై ఆరోపణలు ఉన్న కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న రాజీవ్‌ విగ్రహాలను తొలగించడంతో పాటుగా భారత ప్రభుత్వం ఆయనకిచ్చిన భారతరత్న అవార్డును వెనక్కి తీసుకోవాలని ఆ యువకులు డిమాండ్‌ చేసినట్లు పోలీసులు చెప్పారు.

 ఈ ఘటనపై పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ స్పందిస్తూ.. ‘ఇది శిరోమణి అకాలీదళ్‌ పార్టీ పనే. దీనికి ఆ పార్టీ అధ్యక్షుడు సుఖ్‌వీర్‌ సింగ్‌ బాదల్‌ క్షమాపణ చెప్పాలి. అకాలీదళ్‌ ఇటువంటి చిల్లర రాజకీయాలకు పాల్పడితే వచ్చే లోక్‌సభలో ఆ పార్టీకి తగిన ప్రజలు బుద్ధి చెబుతారు. ఆ అల్లర్లకు గాంధీ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేనప్పటికీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం గాంధీ కుటుంబానికి చెందిన వారి పేర్లను బలవంతంగా అందులో ఇరికించారు’ అని అన్నారు. 

మరిన్ని వార్తలు