రాజ్నాథ్పై పోటీకి శత్రుఘ్న సిన్హా భార్య!
లక్నో: కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ లోక్సభ ఎన్నికల్లో లక్నో స్థానానికి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఆయన ఇదే స్థానం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, మరోసారి అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. నామినేషన్ వేయడానికి ముందు రాజ్నాథ్ ఓ రోడ్ షోలో పాల్గొన్నారు.
రాజ్నాథ్ ఆస్తులు రూ. 4.62 కోట్లు
తన మొత్తం ఆస్తుల విలువ 4.62 కోట్ల రూపాయలని రాజ్నాథ్ నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. వాటిలో రూ. 2.97 కోట్ల విలువైన స్థిరాస్తులు, రూ. 1.64 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయని తెలిపారు. తన భార్య సావిత్రి పేరట రూ. 53 లక్షల విలువైన ఆస్తులు, రూ. 37 వేల నగదు ఉందనీ, తన వద్ద రూ. 68 వేల నగదు ఉందని రాజ్నాథ్ ప్రమాణపత్రం ద్వారా వెల్లడించారు. తన వద్ద .32 బోర్ రివాల్వర్ ఒకటి, మరో డబుల్ బ్యారెల్ గన్ ఉందని పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్ నాయకుడు, బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా భార్య పూనమ్ సిన్హా మంగళవారం సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)లో చేరారు. లక్నో నియోజకవర్గం నుంచి ఆమె రాజ్నాథ్కు పోటీగా ఎస్పీ తరఫున బరిలోకి దిగుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. లక్నోలో ఎన్నికల పోలింగ్ మే 6న జరగనుంది.