రాజ తేజసం

20 Sep, 2019 04:17 IST|Sakshi
తేజస్‌ యుద్ధ విమానం ఎక్కుతున్న రాజ్‌నాథ్‌

యుద్ధవిమానంలో రక్షణ మంత్రి ప్రయాణం

పైలట్‌ అవతారంలో కాసేపు విమానాన్ని నడిపిన రాజ్‌నాథ్‌

బెంగళూరు: స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రయాణించారు. ఓ రెండు నిముషాల సేపు యుద్ధ విమానాన్ని నడిపి ఎంతో థ్రిల్‌కి లోనయ్యారు. తేజస్‌లో ప్రయాణించిన తొలి రక్షణ మంత్రి రాజ్‌నా›థే. బెంగళూరులోని హాల్‌ ఎయిర్‌పోర్టు నుంచి గురువారం దాదాపుగా 30 నిమిషాల సేపు తేజస్‌ యుద్ధ విమానంలో చక్కర్లు కొట్టిన ఆయన ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. తేజస్‌లో ప్రయాణం చాలా హాయిగా, సౌకర్యంగా ఉంది. ఎంతో థ్రిల్‌ పొందాను. నా జీవితంలో ఎప్పటికీ ఇది గుర్తుండిపోతుంది అని రాజ్‌నాథ్‌ చెప్పారు. రాజ్‌నాథ్‌ వెంట ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ ఎన్‌ తివారీ ఉన్నారు. తేజస్‌లో పైలట్‌ వెనక సీట్లో కూర్చొని రాజ్‌నాథ్‌ ప్రయాణించారు. 68 ఏళ్ల వయసున్న రాజ్‌నాథ్‌ స్వదేశీ యుద్ధ విమానం కావడం వల్లే తాను ఇందులో ప్రయాణించే ధైర్యం చేశానని చెప్పారు  

పైలట్‌ అవతారం  
అరగంటసేపు యుద్ధ విమాన ప్రయాణంలో ఓ రెండు నిముషాల సేపు యుద్ధ విమానాన్ని నడిపారు. పైలట్‌ ఇచ్చిన ఆదేశాలను కచ్చితంగా పాటిస్తూ విమానాన్ని రాజ్‌నాథ్‌ నియంత్రించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి లోను చేసింది. రాజ్‌నాథ్‌ విమానాన్ని నడిపిన విషయాన్ని డీఆర్‌డీఓ చీఫ్‌ డా. జీ. సతీష్‌ రెడ్డి వెల్లడించారు. దీనికి రాజ్‌నాథ్‌ స్పందిస్తూ తాను చేసింది ఏమీ లేదని పైలెట్‌ తివారీ చెప్పింది చెప్పినట్టుగా చేశానని నవ్వుతూ వెల్లడించారు.

తేజస్‌ వైపు ప్రపంచ దేశాల చూపు..
యుద్ధ విమానంలో ప్రయాణించిన తర్వాత విలేకరుల సమావేశంలో రాజ్‌నాథ్‌ మాట్లాడారు. హాల్, డీఆర్‌డీఓతో పాటుగా ఈ యుద్ధ విమానం తయారీ కోసం పని చేసిన ఇతర సంస్థలకు ఆయన అభినందనలు తెలిపారు. ‘యుద్ధ విమానాల తయారీ విషయంలో మనం ఎంతో అభివృద్ధి చెందాం. మనమూ యుద్ధ విమానాలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం. ఆగ్నేయాసియా దేశాలు ఎన్నో తేజస్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి’అని చెప్పారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు