జవాన్ల మధ్య నిలబడటం గర్వంగా ఉంది: రాజ్‌నాథ్‌

17 Jul, 2020 15:29 IST|Sakshi

లద్దాఖ్‌: సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు భారత్-చైనా మధ్య చర్చలు జరుగుతున్నాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. సరిహద్దు ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి పరిస్థితులను సమీక్షించేందుకు ఆయన పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. రాజ్‌నాథ్‌ వెంట త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావ‌త్, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణే కూడా ఉన్నారు. ఈ సందర్భంగా సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు రాజ్‌నాథ్‌ సింగ్‌. ‘భారత్‌-చైనా మధ్య సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడానికి చర్చలు జరుగుతున్నాయి. అయితే దీని వల్ల సమస్య ఎంత వరకు పరిష్కారమవుతుంది అనే దానికి మాత్రం నేను హామీ ఇవ్వలేను. కానీ ఒక్కటి మాత్రం నమ్మకంగా చెప్పగలను. ప్రపంచంలోని ఏ శక్తి కూడా మన భూమిని అంగుళమైనా తీసుకోలేదు’ అని రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు. (నిబంధనలు పాటించాల్సిందే!)

రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ.. ‘ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఇచ్చిన ఏకైక దేశం భారతదేశం. మేము ఎప్పుడూ ఒక దేశంపై దాడి చేయలేదు. ఏ దేశ భూములను ఆక్రమించుకోలేదు. ‘వసుదైక కుటుంబం’ (ప్రపంచమంతా ఒకే కుటుంబం) సందేశాన్ని మేము నమ్ముతాం. మాకు హింస కాదు శాంతి కావాలి. ఇతర దేశాల గౌరవాన్ని దెబ్బతీయడం మా స్వభావం కాదు. అలా అని మా దేశ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తే సహించం. తగిన సమాధానం చెప్తాం’ అన్నారు. అంతేకాక ‘మా సైన్యం గురించి గర్వపడుతున్నాము. నేడు మా జవాన్ల మధ్య నిలబడటం గర్వంగా ఉంది. మా జవాన్లు దేశం కోసం తమ ప్రాణాలను అర్పించారు. మొత్తం 130 కోట్ల మంది భారతీయులు మీకు కలిగిన నష్టానికి బాధపడుతున్నారు’ అని ఆయన అన్నారు. అనంతరం వారికి మిఠాయిలు పంపిణీ చేశారు. గల్వాన్ లోయ వద్ద చైనాతో జరిగిన ఘర్షణలో పాల్గొన్న సైనికులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. (ధీటుగా బదులివ్వండి.. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ!)

>
మరిన్ని వార్తలు