భూమి పూజకు 40 కిలోల వెండి ఇటుక 

21 Jul, 2020 04:10 IST|Sakshi

అయోధ్యలో భారీ ఏర్పాట్లు 

ఆగస్టు 5న ప్రధాని మోదీ, సీఎంలు ఉద్ధవ్‌ ఠాక్రే, నితీశ్‌ రాక 

న్యూఢిల్లీ/ముంబై : బృహత్తర రామాలయ నిర్మాణ పనుల ప్రారంభానికి అయోధ్యాపురిలో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆగస్టు 5వ తేదీన జరిగే ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు మహారాష్ట్ర, బిహార్‌ ముఖ్యమంత్రులు ఉద్ధవ్‌ ఠాక్రే, నితీశ్‌ కుమార్‌ తదితర 50 మందిని ఆహ్వానించినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు వివరించింది. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రముఖుల్లో బీజేపీ కురువృద్ధ నేతలు అడ్వాణీ, ఎంఎంజోషీలూ ఉన్నారని తెలిపింది. భూమి పూజలో భాగంగా 40 కిలోల బరువైన వెండి ఇటుకను మోదీ పవిత్ర స్థలంలో ఉంచుతారని ఆలయ ట్రస్టు అధ్యక్షుడు నృత్య గోపాల్‌ దాస్‌ తెలిపారు.

‘ప్రధాన భూమిపూజ కార్యక్రమానికి మూడు రోజులు ముందుగా ఆగస్టు 3వ తేదీ నుంచే వేదోక్తంగా కార్యక్రమాలు మొదలవుతాయి. 4న రామాచార్య పూజ, ఆగస్టు 5వ తేదీ మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రధానమైన భూమిపూజకు ముహూర్తం ఖరారైంది. కోవిడ్‌–19 కారణంగా ఆహ్వానితులు భౌతిక దూరం పాటించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు వీలుగా అయోధ్యలో పెద్ద సంఖ్యలో భారీ స్క్రీన్ల టీవీలను ఏర్పాటు చేస్తారు’అని వివరించారు. రామాలయ ఉద్యమంతో సంబంధమున్న బీజేపీ నేతలుసహా కేంద్ర మంత్రులు పాల్గొంటారని చెప్పారు.  

మరిన్ని వార్తలు