ఆకాశాన్నంటే రామ మందిరం

17 Dec, 2019 01:24 IST|Sakshi
హోం మంత్రి అమిత్‌ షా

4 నెలల్లో అయోధ్యలో ఆలయం పనులు: అమిత్‌ షా

పకూర్‌ (జార్ఖండ్‌): అయోధ్యలో ఆకాశాన్నంటే భవ్యమైన రామమందిర నిర్మాణం నాలుగు నెలల్లో మొదలుకానుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరి వందేళ్ల స్వప్నం సాకారం కానుందని తెలిపారు. జార్ఖండ్‌లోని పకూర్‌ ప్రాంతంలో సోమవారం జరిగిన ఒక ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. రామ జన్మభూమి అంశం కేసు కోర్టుల్లోనే నలిగిపోయేలా చేసేందుకు కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబల్‌ ఎందుకు ప్రయత్నించారో సమాధానమివ్వాలని డిమాండ్‌ చేశారు.

‘కాంగ్రెస్‌ దేశ సరిహద్దులను కాపాడలేకపోయింది, దేశాన్ని అభివృద్ధి చేయలేకపోయింది, ప్రజల మనోభావాలను గుర్తించడంలో విఫలమైంది’ అని అమిత్‌ షా వ్యాఖ్యానించారు. బ్రిటిష్‌ పాలకులపై పోరాడిన గిరిజన నాయకులకు నివాళులర్పిస్తూ ఆయన.. ‘మిర్‌ జాఫర్‌ వంటి దేశ ద్రోహులు పరాయి పాలనకు వంతపాడారు. అలాంటి వారు మీ ప్రతినిధులు కారాదు. దేశాన్ని అభివృద్ధి చేసి రక్షించే మోదీని, బీజేపీని గెలిపించండి’ అని కోరారు. ‘కాంగ్రెస్‌ ఒడిలో కూర్చుని ముఖ్యమంత్రి కావాలని జేఎంఎం నేత హేమంత్‌ సోరెన్‌ కలలు కంటున్నారు. జార్ఖండ్‌ రాష్ట్ర ఉద్యమంలో యువకులపై కాల్పులు జరిపిందెవరో చెప్పాలి’ అని ప్రశ్నించారు. ఒకప్పుడు కాంగ్రెస్‌/ఆర్జేడీ కూటమి యువకుల బలిదానానికి కారణమైతే నేడు హేమంత్‌ పదవి కోసం కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్నందుకు సిగ్గుపడాలన్నారు.

మరిన్ని వార్తలు