ప్రధానితో భేటీ.. ఆలయ నిర్మాణ తేదీపై నిర్ణయం

17 Jul, 2020 12:59 IST|Sakshi

లక్నో: త్వరలోనే అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. జూన్‌లో ప్రారంభం కావాల్సిన నిర్మాణం వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశించిన శ్రీ రామ్‌జన్మ్‌భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు శనివారం అయోధ్యలో సమావేశమై మందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరించిన తేదీని ఖరారు చేయనున్నట్లు సమాచారం. రేపటి సమావేశానికి సంబంధించి మోదీకి ఆహ్వానం పంపినట్లు ట్రస్ట్‌ సభ్యులు తెలిపారు.

ఈ సమావేశంలో ఆలయ నిర్మాణం ప్రారంభమయ్యే తేదీని ఖరారు చేసే అవకాశం ఉందని ట్రస్ట్ సభ్యులు భావిస్తున్నారు. శనివారం నాటి సమావేశానికి ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ న్రిపేంద్ర మిశ్రా కూడా హాజరుకానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలానే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కూడా హాజరుకానున్నారు. మందిర నిర్మాణం ఆగస్టులో ప్రారంభమయ్యే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.(‘న్యాస్‌ ఆకృతి ప్రకారమే నిర్మాణం’)

రామ మందిరానికి జూన్‌10వ తేదీన పునాదులు వేయాలని భావించారు. ఈ కార్యక్రమానికి ప్రధానితో పాటు చాలా మంది కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు ఆహ్వానించారు. కానీ కరోనా వ్యాప్తి కారణంగా కార్యక్రమం వాయిదా పడింది. అంతేకాక ప్రస్తుతం ఆహ్వానితుల జాబితాలో మోదీ, భగవత్, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి, కొద్దిమంది మంత్రులతో పాటు ఈ ప్రాంతానికి చెందిన ఎంపీలు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు