సీనియర్‌ జర్నలిస్టు కన్నుమూత

11 Mar, 2018 17:13 IST|Sakshi

అంత్యక్రియలకు హాజరైన పలువురు పాత్రికేయులు

పీటీఐ ఆధ్వర్యంలో సంస్మరణ సభ

రంజన్‌ రాయ్‌ జ్ఞాపకాల్ని గుర్తుచేసుకున్న సహోద్యోగులు

సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ సీనియర్‌ జర్నలిస్టు రంజన్‌ రాయ్‌ (57) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన శనివారం చనిపోయారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం ఉదయం ముగిశాయి. పెద్ద సంఖ్యలో ఆయన బంధువులు, స్నేహితులు హాజరై చివరిసారిగా వీడ్కోలు పలికారు. రంజన్‌ రాయ్‌ పాత్రికేయ వృత్తిలోకి 1982లో అడుగుపెట్టారు. ఢిల్లీలోని ప్రెస్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా (పీటీఐ), కౌలాలంపూర్‌, న్యూయార్క్‌ లోని అసోసియేటెడ్‌ ప్రెస్‌లలో పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.

2014 టైమ్స్‌ న్యూస్‌ నెట్‌ వర్క్‌లో చేరారు. టైమ్స్‌ న్యూస్‌ నెట్‌ వర్క్‌ అధికారిగా, జాతీయ పత్రికా ఎడిటోరియల్‌ బోర్డులో సభ్యుడిగా పనిచేశారు. ఢిల్లీ సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీ, యూఎస్‌లోని ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ విద్యాభ్యాసం పూర్తి చేశారు. కాగా, రంజన్‌ చనిపోయిన సందర్భంగా ఆయన సేవలను టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రత్యేక సంస్మరణ కార్యక్రమంలో గుర్తుచేసుకుంది. 1980-90ల్లో రంజన్‌తో కలిసి పనిచేసిన పీటీఐ ఎడిటర్‌ ఇన్‌-చీఫ్‌ విజయ్‌ జోషి ఆయన మృతికి సంతాపం తెలుపుతూ రంజన్‌ మంచి జర్నలిస్టు మాత్రమే కాకుండా ఓ నిరసనకారుడు కూడా అన్నారు. ఆయన రిపోర్టర్‌గా ఇంకా సంతృప్తి పొందలేదని చెప్తుండేవారని, చదువుకునే రోజుల్లో ఆయన చాలా తెలివిగా ఉండేవారని, బలమైన దృక్పథాల్ని కలిగి ఉండేవారని కొనియాడారు.

మరిన్ని వార్తలు