రేపిస్టులకు సంక్షేమ పథకాలు కట్‌..!

13 Jul, 2018 09:16 IST|Sakshi

చండీగఢ్‌ : హరియాణా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అత్యాచార కేసుల్లో నిందితులకు సంక్షేమ పథకాలను రద్దు చేయనున్నట్టు ప్రకటించింది. దీని ప్రకారం వారికి రేషన్‌ మినహా మిగత ప్రభుత్వ పథకాలు నిలిచిపోనున్నాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ గురువారం వెల్లడించారు. అందులో భాగంగా వారి వృద్ధాప్య ఫింఛన్‌, వికలాంగ ఫింఛన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆయుధ లైసెన్స్‌లను తొలుత తాత్కాలికంగా రద్దు చేస్తారు. ఒకవేళ కోర్టులో వారు దోషిగా తెలితే వాటిపై పూర్తి నిషేధం విధిస్తారు. కాగా రేషన్‌ మాత్రం యథాతదంగా కొనసాగుతోంది.

ఇంకా ఖట్టర్‌ మాట్లాడుతూ.. మహిళల రక్షణ, భద్రత కోసం ఓ సమగ్ర పథకాన్ని ఆగస్టు 15న గానీ, రక్షా బంధన్‌(ఆగస్టు 26)న గానీ ప్రారంభించనున్నట్టు తెలిపారు. అత్యాచార బాధితులు తమ తరపున ఇష్టమైన లాయర్‌ను నియమించుకునేందుకు వారికి 22,000 రూపాయల ఆర్థిక సహాయం అందివ్వనున్నట్టు ప్రకటించారు. అత్యాచార, ఈవ్‌టీజింగ్‌ కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేసేలా​ రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్‌లకు ఆదేశాలు జారిచేయనున్నట్టు తెలిపారు. అత్యాచారం కేసు విచారణ నెల రోజుల్లో, ఈవ్‌టీజింగ్‌ కేసు విచారణ 15 రోజుల్లో పూర్తిచేయకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాలో 6 పాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.

మరిన్ని వార్తలు