వాటికన్‌కు అత్యాచార బాధిత నన్‌ లేఖ

12 Sep, 2018 01:52 IST|Sakshi
కొచ్చిలో ఆందోళన చేస్తున్న నన్‌లు

బాధ్యుడైన బిషప్‌ను తొలగించాలని వినతి

న్యాయం కోసం కొచ్చిలో కొనసాగుతున్న నిరసనలు

కొట్టాయం/జలంధర్‌: క్రైస్తవ మతాధికారి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని కేరళకు చెందిన నన్‌ వాటికన్‌కు లేఖ రాయడం సంచలనం సృష్టించింది. ప్రస్తుతం జలంధర్‌ డయోసిస్‌ (అధికార పరిధి)కి చీఫ్‌గా ఉన్న ఆ బిషప్‌ను పదవి నుంచి తొలగించాలని, తనకు న్యాయం చేయాలని కోరుతూ భారత్‌లో వాటికన్‌ ప్రతినిధికి ఆమె ఈ నెల 8న రాసిన లేఖ తాజాగా బహిర్గతమైంది. నిందితుడు రోమన్‌ కేథలిక్‌ బిషప్‌ ఫ్రాంకో ములక్కల్‌ రాజకీయ, ధన బలంతో ఈ కేసును నీరుగారుస్తున్నారని ఆరోపించింది.

తనపై వచ్చిన ఆరోపణలను ములక్కల్‌ కట్టుకథలని కొట్టిపారేశారు. నన్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తోందని ఆరోపించారు. మరోవైపు, నన్‌ ఆరోపణలపై కేథలిక్‌ చర్చి సందేహాలు వ్యక్తం చేస్తూ నిందితుడికే మద్దతుగా నిలవడం గమనార్హం. నన్‌కు న్యాయం జరగాలని డిమాండ్‌ చేస్తూ కొచ్చిలో పలు కేథలిక్‌ సంస్థలు చేస్తున్న ఆందోళనలు నాలుగో రోజుకు చేరాయి. విచారణ సవ్యంగానే సాగుతోందని, బాధితురాలికి తప్పకుండా న్యాయం చేస్తామని కేరళ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇండియాలో కేథలిక్‌ బిషప్‌ల కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు కార్డినల్‌ గ్రాసియాస్‌..నన్‌పై రేప్‌ వ్యవహారాన్ని పోప్‌ వద్ద లేవనెత్తనున్నట్లు వార్తలు వెలువడ్డాయి.

రెండు నెలల క్రితం ఫిర్యాదు
2014–16 మధ్య కాలంలో ములక్కల్‌ తనపై పలుమార్లు రేప్, అసహజ శృంగారానికి పాల్పడ్డారని బాధిత నన్‌ రెండు నెలల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా బిషప్‌ను అరెస్ట్‌ చేయకపోవడంతో, కలత చెందిన ఆమె తన మనోవేదనను ఎట్టకేలకు లేఖ ద్వారా బహిర్గతం చేసింది. ములక్కల్‌ను వెంటనే పద వి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు