ఇన్‌స్టాలో రతన్‌ టాటా కీలక మైలురాయి

11 Feb, 2020 14:00 IST|Sakshi

ముంబై: గత ఏడాది అక్టోబర్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన పారిశ్రామిక దిగ్గజం రతన్‌ టాటా నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఐదు నెలల్లోనే పది లక్షల ఫాలోయర్లను సాధించుకుని సోషల్‌ మీడియాలోనూ తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. ఆసక్తికరమైన చిత్రాలు, తన చిన్ననాటి ఫోటోలను పోస్ట్‌ చేస్తూ నెటిజన్లను తన వైపు తిప్పుకున్నారు. తన ఇన్‌స్టా ప్రయాణాన్ని ఫలవంతం చేసినందుకు ధన్యవాదాలు అనే క్యాప్షన్‌తో తాను నవ్వుతూ కూర్చుని ఉన్న ఫోటోను రతన్‌ టాటా ఇటీవల పోస్ట్‌ చేశారు.

తన ఫేజ్‌ను ఫాలో అవుతున్న సంఖ్యను ఇటీవల తాను చూడగా అది ఓ కీలక మైలురాయిని అధిగమించడం తనకు సంతోషాన్నిస్తోందని ఆ పోస్ట్‌లో చెప్పుకొచ్చారు. తాను ఇన్‌స్టాగ్రామ్‌లో చేరిన సమయంలో ఇంతటి భారీ అద్భుత ఆన్‌లైన్‌ కుటుంబాన్ని ఊహించలేదని, అందుకు మీకందరికీ ధన్యవాదాలు అని చెప్పుకొచ్చారు. మన ప్రయాణం ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నానని అన్నారు. టాటా పోస్ట్‌కు నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తూ దేశంలోనే మీరు ఓ లెజెండ్‌ అంటూ పారిశ్రామిక దిగ్గజాన్ని కొనియాడారు. రతన్‌ టాటా పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

చదవండి: హాలీవుడ్‌ స్టార్‌లా రతన్‌ టాటా..

మరిన్ని వార్తలు