‘బాబర్‌నేందుకు పూజించాలి..?’

25 Dec, 2018 16:02 IST|Sakshi

లక్నో : రామ జన్మభూమి వివాదం పరిష్కారం కోసం ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేయాల్సిందిగా సుప్రీంకోర్టును కోరతనంటున్నారు కేంద్ర మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అయోధ్య వివాదం ఎప్పటినుంచో కొనసాగుతుంది. ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలి. ఇందుకుగాను నేను సుప్రీం కోర్టును కలిశి.. సమస్య పరిష్కారం కోసం ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేయాల్సిందిగా కోరతానని తెలిపారు.

శబరిమల ఆలయం కేసులో సుప్రీం కోర్టు చాలా త్వరగా తీర్పు చెప్పింది. మరి 70 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రామ జన్మభూమి కేసు విషయంలో మాత్రం ఎందుకు ఆలస్యం చేస్తోందని ప్రశ్నించారు. ఈ సందర్భంగా రాజ్యాంగాన్ని చూపిస్తూ.. దీనిలో రాముని గురించి ఉంది, కృష్ణుని గురించి ఉంది ఆఖరుకి అక్బర్‌ గురించి కూడా ఉంది. కానీ బాబర్‌ గురించి మాత్రం ఎక్కడా చెప్పలేదు. అలాంటప్పుడు మేమేందుకు బాబర్‌ను పూజించాలని ప్రశ్నించారు. అయితే ఇలాంటి విషయాలు మాట్లాడితే.. వేరే రకమైన వివాదాలు తలెత్తుతాయన్నారు.

మరిన్ని వార్తలు